
సాక్షి, అమరావతి: పిడుగులు పడనీ, పెనుగాలులు రానీ, వానలతో చెట్లు కూలనీ, వరదలతో ట్రాన్స్ఫార్మర్లు కుప్పకూలనీ.. అగ్ని ప్రమాదాలు సంభవించనీ.. విద్యుత్ సరఫరా మాత్రం ఆగడానికి వీల్లేదు.. వైర్లు తెగి, స్తంభాలు కూలినా కరెంటును ఆపడం కుదరదు. ప్రాణాలుపోతే మాకేంటి.. ఎవరేమైపోతే మాకేంటి.. అన్నట్లుగా ఉంది ఈనాడు రామోజీరావు తీరు.
అందుకేనేమో వాతావరణంలో అకస్మాత్తుగా వస్తున్న మార్పులతో అక్కడక్కడా కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిపితే రాష్ట్రమంతటా విద్యుత్ కోతలు విధిస్తున్నారంటూ అడ్డగోలు రాతలు రాస్తోంది. ఆ క్రమంలోనే విద్యుత్ ‘కోతలు బాబోయ్’ అంటూ సోమవారం ‘ఈనాడు’ ప్రచురించిన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని గుంటూరు టౌన్–2, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీహెచ్ రమేష్ స్పష్టంచేశారు.
బలమైన ఈదురుగాలులవల్లే..
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో శనివారం, ఆదివారం వాతావరణంలో జరిగిన మార్పులు దృష్ట్యా ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఈదురు గాలులు వచ్చాయి. దీంతో అక్కడక్కడ తీగలు తెగి, విద్యుత్ స్తంభాలు విరిగాయి. ఈ నేపథ్యంలో.. పడిపోయిన వాటిని యథాస్థితికి తీసుకొచ్చి, లోడ్ను సరిచేయడానికి విద్యుత్ సరఫరాను కొంతసేపు నిలపాల్సి వచ్చింది. విద్యుత్ పునరుద్ధరించి వినియోగదారులకు అందించే క్రమంలోనే ఇలా జరిగింది. అంతేగానీ ఎటువంటి అధికారిక కోతలు విధించటంలేదని ఏఈ వెల్లడించారు.