'బాబు, పవన్‌లకు దుర్దినం.. ప్రజలకు శుభదినం'

East Godavari YSRCP Leaders Were Happy With Approval Of Three Capitals Bill - Sakshi

సాక్షి, ఏలూరు: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేశారు. సీఆర్‌డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవాలన్న చంద్రబాబు కుట్రలను సమాధి చేసిన శుభదినం. రాజధాని ఎప్పటికీ  మారదు మారదు అంటూ చంద్రబాబుకు వంత పాడిన పవన్ కల్యాణ్‌కి ఇది దుర్దినం. ప్రజలకు శుభదినం. మూడు రాజధానులు ప్రజల కోరిక. మూడు ప్రాంతాల అభివృద్ధి విజ్ఞులు ఆలోచన. ఇకనైనా అజ్ఞాతవాసి ట్విట్టర్ నివాసి పవన్ కల్యాణ్ కళ్లు తెరువు అని గ్రంధి శ్రీనివాస్‌ హితువు పలికారు. 


రాష్ట్ర ప్రజల విజయం: కొట్టు సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆకాంక్ష పరిపాలన వికేంద్రీకరణగా మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపటం ఎంతో శుభసూచకమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు దురుద్దేశంతో దోపిడీ చేయాలనే ఆలోచనతో ప్రవేశపెట్టిన సీఆర్డీఏ బిల్లును రద్దు చేయడం ఎంతో ఆనందదాయకం. అన్ని ప్రాంతాలకు సమగ్రమైన అభివృద్ధి కావాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ యజ్ఞం విజయవంతం కావటం రాష్ట్ర ప్రజల విజయంగా భావిస్తున్నారు. ప్రజలందరికీ జగన్‌మోహన్ రెడ్డిపై పూర్తి నమ్మకం ఉందని ఈ రోజు గవర్నర్ నిర్ణయాలే తెలియజేస్తున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రముఖమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతారనడంలో ఎలాంటి సందేహం లేదని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. 

రాష్టానికి శుభదాయకం: ఎంపీ భరత్‌
అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదంపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులతో పాటు.. రెండు రాజధానుల నడుమ ఉన్న గోదావరి జిల్లాలు కూడా అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. వెనుకబడిన 3 ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు 4 రాయలసీమ జిల్లాలు కూడా రాజధాని వికేంద్రీకరణతో అభివృద్ధి చేయడానికి వీలు కలుగుతుంది. శ్రావణ శుక్రవారం రోజు ఈ నిర్ణయం వెలువడటం రాష్టానికి శుభదాయకం అని మార్గాని భరత్‌ తెలిపారు. 

కృష్ణా: పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదంపై ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హర్షం వ్యక్తం చేశారు. పరిపాలన వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారని తెలిపారు. పరిపాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందునునట్లు ఉదయభాను వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top