సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట మండల పరిధిలోని వడిశలేరు-రంగంపేట మధ్య ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం టైర్ పంచర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
సామర్లకోట ప్రాంతానికి చెందిన కూలీలు బాపట్ల కొల్లూరులో నిర్మాణ పనులకు వెళ్లేందుకు టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. వడిశలేరు-రంగంపేట మధ్యకు చేరుకోగానే వాహనం టైర్ ఒక్కసారిగా పంచర్ కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం రోడ్డుపై బోల్తా పడింది.
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనంలో ప్రయాణిస్తున్న బాబు, మురమర్ల రాజు, కాకాడ రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా సామర్లకోటకు చెందిన వాళ్లుగా గుర్తించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
ఉదయం పనుల కోసం బయలుదేరిన కూలీలు ప్రమాదానికి గురవడంతో సామర్లకోట ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.


