జనసైనికులు గరం గరం
టీడీపీ పల్లకీ మోసేందుకే పరిమితం కావడంపై పార్టీలో నిరుత్సాహం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేనలో పార్టీ పదవుల భర్తీపై నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆగస్టు 15లోగా అన్ని స్థాయిల్లో పదవులను భర్తీ చేస్తామని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించినా ఆ దిశగా కదలిక లేదని జనసైనికులు మండిపడుతున్నారు. ఆరోగ్యం సరిగా లేదంటూ పదవుల భర్తీని వాయిదా వేయడం సరికాదని, ఇకనైనా దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగాలంటే క్షేత్ర స్థాయి పదవుల భర్తీ కీలకమని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమిగా జతకట్టినప్పటి నుంచీ టీడీపీ ప్రయోజనాలు, ఆ పార్టీ విజయం, పల్లకీ మోసేందుకే జనసేన పరిమితం కావడంపై ఆ పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి.
‘సంస్థాగతంగా బలోపేతం అయ్యే ఆలోచనే లేదు. టీడీపీ, జనసేన నేతల మధ్య వర్గవిభేదాలు నెలకొన్న సందర్భాల్లో పార్టీ అధినేత పవన్ స్వయంగా సర్దుకుపోవాలంటూ ఉచిత సలహా ఇవ్వడం నిరుత్సాహానికి గురిచేస్తోంది’ అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పార్టీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామని పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. పదవులు ఆశిస్తున్న వారు తమ దరఖాస్తులనూ అధిష్టానానికి పంపారు.
అయితే ఆగస్టు ముగుస్తున్నప్పటికీ దీనిపై అతీగతీ లేకపోవడంతో ఆశావహుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. నిజానికి జనసేనలో పదవుల భర్తీ ప్రక్రియ చేపడతామని ఆరు నెలల క్రితమే ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించి వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్నా పార్టీలో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదన్న భావన జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ పార్టీకి మొండిచేయి చూపారన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది.


