జిల్లాకో సైబర్‌ సెల్, సోషల్‌ మీడియా ల్యాబ్‌ | DGP Gautam Sawang says about Cyber Cell and Social Media Lab | Sakshi
Sakshi News home page

జిల్లాకో సైబర్‌ సెల్, సోషల్‌ మీడియా ల్యాబ్‌

Jan 18 2022 3:20 AM | Updated on Jan 18 2022 3:20 AM

DGP Gautam Sawang says about Cyber Cell and Social Media Lab - Sakshi

సాక్షి, అమరావతి: ఆన్‌లైన్‌ మోసాలు, వేధింపులను అరికట్టేందుకు జిల్లాకో సైబర్‌ సెల్, ల్యాబ్, సోషల్‌ మీడియా ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు. జిల్లా స్థాయిలో సైబర్‌ సెల్స్, సోషల్‌ మీడియా ల్యాబ్‌లకు వేర్వేరుగా బీటెక్‌ అర్హత ఉన్న ఎస్‌ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లు, సిబ్బందిని ఎంపిక చేసినట్టు తెలిపారు. ప్రతి జిల్లాకూ సైబర్‌ లీగల్‌ అడ్వయిజర్, సైబర్‌ నిపుణులను నియమిస్తామని చెప్పారు. సైబర్‌ సెల్స్, సోషల్‌ మీడియా ల్యాబ్‌ల కోసం ఎంపిక చేసిన అధికారులు, సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి వెబినార్‌ ద్వారా సోమవారం డీజీపీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్, డెస్క్‌ ఫోరెన్సిక్, మొబైల్‌ ఫోరెన్సిక్, పాస్‌వర్డ్‌ రికవరీ, సీడీఆర్‌ అనాలసిస్, ఇమేజ్‌ ఎన్‌హాన్స్‌మెంట్, ప్రోక్సీ ఎర్రర్‌ ఐడెంటిటీ, ఈ–మెయిల్, సోషల్‌ మీడియా తదితర టూల్స్‌లతో కూడిన ఈ సైబర్‌ సెల్స్, సోషల్‌ మీడియా ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా స్థాయిలోనే డిజిటల్‌ ఎవిడెన్స్, సోషల్‌ మీడియా ఐడెంటిటీ వంటి కీలక సాక్ష్యాధారాలను సేకరించడం ద్వారా దోషులను గుర్తించి సత్వరం శిక్షలు పడేలా చొరవ చూపుతామని చెప్పారు.

ఇప్పటికే సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న 1,551 మంది ప్రొఫైళ్లను గుర్తించి, వారిపై సైబర్‌ బుల్లీ షీట్స్‌ తెరిచినట్టు డీజీపీ వెల్లడించారు. జిల్లా స్థాయి సైబర్‌ సెల్స్, సోషల్‌ మీడియా ల్యాబ్‌లను అనుసంధానిస్తూ రాష్ట్ర స్థాయిలో సైబర్‌ సెల్స్, సోషల్‌ మీడియా ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు అవసరమైన నిధులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారని డీజీపీ గౌతం సవాంగ్‌ వివరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement