ప్రధాన నగరాల్లో క్షీణిస్తున్న వాయు నాణ్యత
స్వచ్ఛ వాయు సర్వేక్షణ–2026 నివేదికతో సర్కారు వైఫల్యాలు బట్టబయలు
చంద్రబాబు సర్కారువి ఉత్తుత్తి మాటలే!
21వ ర్యాంకుకు పడిపోయిన విశాఖ నగరం
అదే బాటలో రాజమహేంద్రవరం.. 11 స్థానాలు దిగజారిన కడప
ఒంగోలు, అనంతపురం పరిస్థితీ అంతంతే
13 నగరాలు పాల్గొంటే.. జాతీయ స్థాయిలో ఒక్క గుంటూరుకే గుర్తింపు
కేటగిరీ–1లో రాష్ట్రానికి దక్కని చోటు
కాగితాల్లోనే గాలి కాలుష్య నియంత్రణ చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, గాలి నాణ్యత మెరుగుదలపై సీఎం చంద్రబాబు నిత్యం చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నాయి కానీ క్షేత్రస్థాయిలో గడప దాటడంలేదు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్–2026’ ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వ డొల్లతనాన్ని, వైఫల్యాలను బట్టబయలు చేశాయి.
జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ సర్వేలో రాష్ట్రంలోని అతిపెద్ద పారిశ్రామిక నగరమైన విశాఖపట్నం, సాంస్కృతిక రాజధాని రాజమండ్రి, రాయలసీమ ముఖద్వారం కడప బాగా వెనుకబడ్డాయి. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ) అమలుతీరు కాగితాలకే పరిమితమైందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. రాష్ట్రం మొత్తం మీద కేవలం గుంటూరు నగరానికి మాత్రమే (195 మార్కులతో జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్) చెప్పుకోదగ్గ చోటుదక్కింది. మిగిలిన ప్రధాన నగరాల్లో గతేడాది కంటే దారుణమైన ర్యాంకులు వచ్చాయి. 2025తో పోలిస్తే 2026 నాటికి ర్యాంకులు, మార్కులు భారీగా పడిపోయాయి.
పారిశ్రామిక సిరి ’వైజాగ్’ బేజార్..
రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజన్ లాంటి విశాఖపట్నం వాయు కాలుష్య నివారణలో ఘోరంగా ఫెయిలైంది. 2025లో 177.6 మార్కులతో 17వ ర్యాంకులో ఉన్న ఈ నగరం.. ఏడాదిలో 172 మార్కులతో 21వ స్థానానికి పడిపోయింది.
కడపలో 11 స్థానాల పతనం
వైఎస్సార్ కడప నగర పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. ఒకే ఒక్క ఏడాదిలో ఏకంగా 11 ర్యాంకులు దిగజారి 34వ స్థానానికి పడిపోయింది. గతేడాది 168 మార్కులు సాధించిన ఈ నగరం, ఈసారి కేవలం 144 మార్కులకే పరిమితమైంది.
వెనకడుగులో రాజమండ్రి, ఒంగోలు..
ఇక చారిత్రక నగరం రాజమండ్రి సైతం 12వ ర్యాంకు నుంచి 14వ స్థానానికి దిగజారింది. ఒంగోలు నాలుగు స్థానాలు నష్టపోయి 25వ ర్యాంకుకు పడిపోయింది. అనంతపురం ఒక ర్యాంకు మెరుగైనా మార్కులు (146.5 నుంచి 144కి) తగ్గడం గమనార్హం. కర్నూలు (29వ ర్యాంకు) ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లుంది.
రాజధాని విజయవాడకు దక్కని ‘టాప్–3’ గౌరవం..
రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడ గతేడాది 13వ స్థానం నుంచి 8వ స్థానానికి (186 మార్కులు) కొంత మెరుగైనప్పటికీ, జాతీయ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో మాత్రం నిలవలేకపోయింది. కాకపోతే విజయవాడలోని 60వ వార్డు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించడం, కొన్ని నిర్దిష్ట వార్డులకు నగదు పురస్కారాలు దక్కడం ఒక్కటే ఊరట కలిగించే అంశం.
726 వార్డులకుగాను పరిశీలనకు 39 వార్డులే..
ఇక వార్డు స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా 726 వార్డులు సర్వేక్షణ పరిధిలోకి వచ్చాయి. వీటిలో 39 వార్డులను రాష్ట్రస్థాయి సమీక్షకు ఎంపిక చేశారు. సంబంధిత ప్రాంతీయ పురపాలక అధికారులు కూడా ఈ వార్డులను తనిఖీ చేశారు. వార్డు స్థాయిలో విజయవాడ 60వ వార్డు జాతీయంగా రెండో ర్యాంకు సాధించడంతోపాటు గుంటూరు, విజయవాడ, నెల్లూరులోని కొన్ని వార్డులకు రాష్ట్రస్థాయిలోనూ నగదు పురస్కారాలు లభించాయి. ఇంత పెద్ద సంఖ్యలో నగరాలు, వార్డులు సర్వేక్షణలో పాల్గొన్నప్పటికీ.. ప్రధాన నగరాలు ఎందుకు జాతీయ స్థాయిలో అగ్రస్థానాల్లో నిలవలేకపోయాయి? అన్నదే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్న.
కాగితాల్లోనే చర్యలు..
స్వచ్ఛ వాయు సర్వేక్షణలో బయోమాస్, మున్సిపల్ వ్యర్థాల దహనం నియంత్రణ, రోడ్డుపై దుమ్ము తగ్గింపు, నిర్మాణ వ్యర్థాలు, వాహన.. పరిశ్రమల ఉద్గారాల నియంత్రణ, ప్రజల్లో అవగాహన వంటి అంశాలకు మార్కులు కేటాయిస్తారు. వీటిపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారికంగా చెబుతున్నా.. కొన్ని ప్రధాన నగరాల స్కోర్లు, ర్యాంకులు మాత్రం వెనుకబడటం గమనార్హం. ప్రత్యేకించి విశాఖపట్నం వంటి పారిశ్రామిక నగరం 21వ స్థానానికి, కడప 34వ స్థానానికి పడిపోవడం చూస్తుంటే క్షేత్రస్థాయిలో చంద్రబాబు సర్కారు లోపాన్ని, నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కడప, ఒంగోలు వంటి నగరాల వైఫల్యాలు ప్రభుత్వ పనితీరుకు అద్దంపడుతున్నాయి.


