దేశంలో తగ్గుతున్న నిరుద్యోగ రేటు | Decreasing unemployment rate in the country | Sakshi
Sakshi News home page

దేశంలో తగ్గుతున్న నిరుద్యోగ రేటు

Jun 19 2024 5:47 AM | Updated on Jun 19 2024 5:47 AM

Decreasing unemployment rate in the country

2021–22లో 4.1 శాతం.. 2022–23లో 3.2 శాతం 

నిరక్షరాస్యులతోపాటు విద్యావంతుల్లో తగ్గిన నిరుద్యోగ రేటు 

పీఎంఎంవై కింద స్వయం ఉపాధికి రూ.10 లక్షలు రుణం 

గత ఏడాది నవంబర్‌కి పీఎంఎంవై కింద 44.41 కోట్ల ఖాతాలకు రుణం 

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ వెల్లడి 

సాక్షి, అమరావతి: దేశంలో నిరుద్యోగ రేటు తగ్గుతోందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిరక్షరాస్యులతో పాటు విద్యావంతుల్లో కూడా నిరుద్యోగ రేటు తగ్గిందని తెలిపింది. 2021–22లో దేశంలో నిరుద్యోగ రేటు 4.1 శాతం ఉండగా 2022 – 23లో 3.2 శాతానికి తగ్గిందని తెలిపింది. నైపుణ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్కిల్‌ ఇండియా మిషన్‌ను ప్రారంభించిందని, మార్కెట్‌లో అవసరమైన నైపుణ్యాలపై దేశంలోని యువతకు రీ స్కిల్లింగ్, అప్‌ స్కిల్లింగ్‌ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలను, ఉత్పాదకతను పెంచుతున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది.

ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన, జన శిక్షణ సంస్ధాన్, నేషనల్‌ అప్రెంటిస్‌íÙప్‌ ప్రమోషన్‌ స్కీమ్,  ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి, స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు పేర్కొంది. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా అన్ని విద్యా సంస్థల్లో విద్యతో పాటు వృత్తి విద్యా కార్యక్రమాలను ప్రారంభించినట్లు పేర్కొంది.

 యువతకు స్వయం ఉపాధిని మరింత సులభతరం చేసేందుకు ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) ప్రారంభించినట్లు తెలిపింది. దీని కింద స్వయం ఉపాధికి పూచీ కత్తు లేకుండా ఒక్కొక్కరికి రూ.10 లక్షల రుణం మంజూరు చేయించడం ద్వారా సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్ధలను విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. పీఎంఎంవై కింద గత ఏడాది నవంబర్‌ నాటికి 44.41 కోట్ల ఖాతాలకు రుణాలు  మంజూరు చేసినట్లు వివరించింది. వీధి వ్యాపారుల కోసం కూడా ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement