డీఎస్సీ హాల్‌టికెట్లలో గందరగోళం | Confusion Over DSC Hall Tickets In Andhra Pradesh, Know Complete Details About This Issue | Sakshi
Sakshi News home page

డీఎస్సీ హాల్‌టికెట్లలో గందరగోళం

Jun 1 2025 5:14 AM | Updated on Jun 1 2025 6:03 PM

Confusion over DSC hall tickets

ఒకే రోజు.. ఒకే సమయంలో రెండు పరీక్షలు

ఆన్‌లైన్‌లో ఒకలా.. హాల్‌టికెట్‌లో మరోలా పరీక్ష తేదీ

ఈడబ్ల్యూఎస్‌ కోటాలో దరఖాస్తు చేసుకుంటే హాల్‌టికెట్‌లో ఓసీగా నమోదు

తీవ్ర ఒత్తిడికి గురవుతున్న అభ్యర్థులు

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: కూటమి ప్రభుత్వం డీఎస్సీ హాల్‌టికెట్ల జారీలో గందరగోళాన్ని సృష్టిస్తోంది. శుక్రవారం వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు విడుదల చేస్తామని ప్రకటించడంతో అభ్యర్థులు ప్రిపరేషన్‌ మానుకుని ఇంటర్నెట్‌ ముందు పడిగాపులు పడేలా చేసింది. తీరా అర్ధరాత్రి దాటిన తర్వాత హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో పెట్టింది. తొలుత ఆన్‌లైన్‌లో పరీక్ష తేదీని ఒక రకంగాను, ఆ తర్వాత హాల్‌టికెట్‌లో మరొక రకంగా చూపించినట్టు అభ్యర్థులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆరోపిస్తున్నారు. 

కొందరికైతే వారి చిరునామాకు ఏకంగా 150 కిలోమీటర్ల దూరంలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే సమయం ఇవ్వకుండా ఉదయం ఒక పరీక్ష, మధ్యాహ్నం మరో పరీక్ష పెట్టడాన్ని తప్పుపడుతున్నారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో దరఖాస్తు చేసుకుంటే హాల్‌టికెట్‌లో ఓసీ కింద చూపిస్తోందని వాపోతున్నారు. ఫలితంగా రిజర్వేషన్‌లో వెనుకబడిపోతామని చెబుతున్నారు. 

సందేహాల నివృత్తికి హెల్ప్‌ డెస్క్‌
మెగా డీఎస్సీ–2025 పరీక్షల హాల్‌టికెట్లు విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని డీఎస్సీ కన్వీనర్, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ఎం.వెంకట కృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్‌టికెట్లలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు హెల్ప్‌ డెస్క్‌ (62817 04160, 81219 47387, 81250 46997, 93988 10958, 79956 49286, 79957 89286, 99630 69286,70138 37359)కు ఫోన్‌చేసి లేదా dscgrievances@apschooledu. in  అడ్రస్‌కు మెయిల్‌ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు.

డీఎస్సీ అభ్యర్ధుల వయో పరిమితి 47 ఏళ్లకు పెంచాలి
డీఎస్సీ అభ్యర్థుల వయో పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని అఖిల భారత యువజన సమాఖ్య, ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్‌ చేశాయి. «శనివారం విజయవాడలోని ధర్నా చౌక్‌లో ఏఐవైఎఫ్, నిరుద్యోగ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో ‘టెట్‌ నిర్వహించిన తర్వాతే డీఎస్సీ పరీక్ష నిర్వహించాలి’ అని డిమాండ్‌ చేస్తూ ధర్నా చేశారు.  ఎప్పుడో జరిగిన టెట్‌ ఆధారంగా డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. దీంతో 2023–25 మధ్య బీఈడీ పూర్తి చేసిన వారు డీఎస్సీకి అర్హత లేక తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. 

తప్పుల తడకగా..
విజయనగరంలో శిక్షణ పొందుతున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన బెహర చక్రధరరావు డీఎస్సీకి అర్హత ఉన్న ఎస్‌ఏ (ఎన్‌ఎల్‌), ఫిజికల్‌ డైరెక్టర్, ఫిజికల్‌ డైరెక్టర్‌ స్కూల్‌ అసిస్టెంట్, పీఈటీ వీహెచ్, పీఈటీ మొత్తం నాలుగు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. శనివారం విడుదల చేసిన హాల్‌టికెట్‌లో రెండు పోస్టులకు ఒకే రోజు, ఒకే సెషన్, ఒకే సమయానికి హాజరుకావాలని పేర్కొన్నారు. నాలుగు పరీక్షలకు రుసుం కట్టానని, తాజాగా విడుదల చేసిన హాల్‌ టికెట్‌ ద్వారా మూడు పరీక్షలు మాత్రమే రాయగలుగుతానని చక్రధరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement