సొంత రాజ్యాంగాలంటే.. కేసులు కట్టి జైల్లో పెట్టాలి | Conference on Protection of Human Rights and Role of Lawyers | Sakshi
Sakshi News home page

సొంత రాజ్యాంగాలంటే.. కేసులు కట్టి జైల్లో పెట్టాలి

Jun 21 2025 4:08 AM | Updated on Jun 21 2025 4:08 AM

Conference on Protection of Human Rights and Role of Lawyers

ఒక రాజ్యాంగం ఉండగా ఈ ‘బుక్‌’లేంటి? 

టీవీ డిబేట్‌లో నవ్వితే జర్నలిస్టుపై కేసు పెట్టారంటే నవ్వొస్తోంది 

ప్రజల హక్కుల కోసం న్యాయవాదులు పోరాడకపోతే వారి హక్కులకూ భంగం 

రాష్ట్రంలో తొలిసారిగా ఐపీఎస్‌లు జైలుపాలు 

అధికారులు చట్టం ప్రకారం నడుచుకోవాలి 

తెనాలి ఘటనలో పోలీసులదే కాదు.. పైనున్న అధికారులదీ బాధ్యతే 

మహిళలు, చిన్నారులపై దారుణాతి దారుణాలు జరుగుతున్నాయి

‘మానవ హక్కుల పరిరక్షణ– న్యాయవాదుల పాత్ర’పై సదస్సులో వక్తలు

సాక్షి, అమరావతి: ప్రతిఒక్కరి హక్కులు పరిరక్షించాలన్న ఆలోచనతోనే రాజ్యాంగం రాయాల్సి వచ్చిందని, సవివరణలతో కూడిన రాజ్యాంగం అమలులో ఉండగా కొత్తకొత్త రాజ్యాంగాలు, పుస్తకాల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తోందని పలువురు వక్తలు ప్రశ్నించారు. ఒకరు రెడ్‌బుక్, ఇంకొకరు ఎల్లోబుక్, మరొకరు ఇంకో బుక్‌ అంటున్నారని.. ఈ రకమైన అదనపు రాజ్యాంగాల అవ­సరం ఎందుకొచ్చిందని వారు నిలదీశారు. రాజ్యాంగంపై ప్రమాణంచేసి అధికారం చేపట్టిన ప్రజాప్రతినిధులు రాజ్యాంగాలు ప్రయోగిస్తాం,  అమలుచేస్తామంటే.. అది కచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన కింద­కు వస్తుందని, వీరిపై కేసులు నమోదుచేసి జైల్లో పెట్టాలని ముక్తకంఠంతో కోరారు.

ఆంధ్ర అడ్వకేట్స్‌ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవా­రం విజయవాడ ఐలాపురం హోటల్‌లో ‘మా­న­వ హక్కుల పరిరక్షణ–న్యాయవాదు­ల పాత్ర’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఫోరం రాష్ట్ర కనీ్వనర్‌ బి. అశోక్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్, ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యా­యమూర్తి జస్టిస్‌ బి. చంద్రకుమార్, విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు డాక్టర్‌ వసు­ంధర, మాజీ ఐఏఎస్‌ అధికారి, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి.విజ­య్‌కుమార్, హైకోర్టు న్యాయవాది మల­సాని మనో­హర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలపై పిల్‌ వేయాలి..
ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్న వారంతా ప్రభుత్వోద్యోగుల బదిలీలకు లేఖలు ఇస్తున్నారు. వారికి అనువైన పోలీసులను వేసుకుంటున్నారు. నియోజకవర్గాన్ని సామ్రాజ్యంగా భావించి అక్కడున్న సహజ వనరులు ఎలా దోచుకోవాలి? అన్నదానికే వీరు ప్రాధాన్యత ఇస్తున్నారు. నిజానికి.. ఎవరైనా ఒక అధికారి ఎమ్మెల్యే సిఫార్సు లేఖ తెచ్చుకుంటే అతన్ని సస్పెండ్‌ చెయ్యొచ్చు. అలాగే, ప్రజాప్రతినిధులు రాతపూర్వకంగా సిఫార్సు లేఖలిస్తున్నారు. ఇదొక్కటి చాలు ఎమ్మెల్యేలపై కేసు పెట్టడానికి. వీటిపై న్యాయవాదులు పిల్‌ వేయాలి. ఇక ఈ ఏడాది పాలనలో 766 హత్యాయత్నాలు జరిగితే వీటిలో 390 ఘటనలు రాజకీయపరమైనవే. 2,466 కేసుల్లో 500 మంది జైల్లో ఉన్నా­రు. సోషల్‌ మీడియాపై 440 కేసులు బనాయించగా.. 79 మంది జైళ్లలో ఉన్నారు. – విజయ్‌కుమార్, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి

నవ్వితే కేసు అంటే నవ్వొస్తోంది..  
టీవీ డిబేట్‌లో నవ్వితే జర్నలిస్టుపై కేసు పెట్టారని అంటే నవ్వొస్తోంది. ఈ కేసులో ప్రభుత్వ పరువు ఏమైంది? అసలీ వ్యవహారంలో ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా వచ్చింది? అధికారం మారితే పోలీసులు మారిపోతారా? పోలీసులే చంపుకుంటూపోతే ఇక హక్కుల గతేమిటి? హక్కులు పరిరక్షించుకుంటూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. కారణం లేకుండా ఏ వ్యక్తినీ నిర్బంధించకూడదు. తెనాలి ఘటన వంటి వాటిల్లో యువకులను కొట్టిన పోలీసులదే కాదు పైనున్న అధికారులదీ బాధ్యతే. ఈ సమాజంలో లాయర్లు, ప్రజలు ఫిఫ్త్‌ ఎస్టేట్‌. రైట్‌ టు ఎడ్యుకేషన్, ఫ్రీడమ్‌ టు స్పీచ్‌ లేకపోతే మన మనుగడ కష్టం. ప్రజల హక్కుల కోసం న్యాయవాదులు పోరాడకపోతే న్యాయవాదుల హక్కులు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.  – మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌  

 అణచివేత ఎల్లకాలం పనిచేయదు.. 
విజయవాడ ఒకప్పుడు రాజకీయ రాజధాని. ఎంతో ఉన్నతమైనది. అలాంటి చోట కులతత్వం పెరగడం విచారకరం. రా­ష్ట్ర­ంలో మహిళను చెట్టుకు కట్టేసి కొడుతుంటే.. యువకులను నడిరోడ్డుపై పడేసి కొడుతుంటే ఎవరూ స్పందించకపోతే భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించాలి. ముఖ్యంగా లాయర్లూ స్పందించకపోతే ఎలా? రాజకీయ నాయకులు యువతను ఎప్పుడూ మత్తులోనే ఉంచి వారి పబ్బం గడుపుకుంటున్నారు.

అణచివేసి రాజ్యమేలుతానంటే అది ఎల్లకాలం పనిచేయదు. స్వతంత్ర పోరా­టంలో న్యాయవాదులే ఎక్కువ. తెనాలి, కుప్పం వంటి ఘటనలపై సమాజం, న్యాయవాదులు స్పందించకపోతే చాలా ప్రమాదం. ప్రజల హక్కులను కాపాడే బాధ్యత న్యాయవాదులు తీసుకోవాలి. – జస్టిస్‌ బి. చంద్రకుమార్, ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి

పీ4 విధానం అశాస్త్రీయమైనది.. 
ప్రభుత్వం తీసుకొచ్చిన పీ4 విధా­నం పూర్తిగా అశాస్త్రీయమైనది. ఇది పేద ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమే తప్ప మరొకటి కాదు. ఇలాంటి విషయాలను న్యాయవాదులు ఖండించాలి. – డాక్టర్‌ వసుంధర, విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement