పేద పిల్లలు.. పెద్ద చదువులు

CM YS Jaganmohan Reddy Jagananna Vidya Deevena Second installment funds - Sakshi

వారంతా ఇంజనీర్లు, డాక్టర్లు కావాలి.. అదే నా తపన.. అందుకే విద్యా దీవెన, వసతి దీవెన

జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధులు విడుదల చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

9.88 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ

పెద్ద చదువులతోనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయి

అక్షరాస్యతలో దేశ సగటు కంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం

బ్రిక్స్‌ దేశాలతో పోలిస్తే కాలేజీలో చేరికలు భారత్‌లో తక్కువ

ఇంటర్‌ తర్వాత 73 శాతం మంది పిల్లలు చదువు ఆపేస్తున్నారు

ఈ పరిస్థితిని మార్చడానికే పూర్తి స్థాయిలో ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం

ఇదివరకెన్నడూ లేని విధంగా విద్యా రంగానికి పెద్ద పీట వేశాం

అంగన్‌వాడీల నుంచే ఇంగ్లిష్‌ మీడియం తీసుకు వచ్చాం 

పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువు ఒక్కటే అని గట్టిగా నమ్మిన వ్యక్తిని. అందుకే రెండేళ్లలో విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. రెండేళ్లలో మొత్తంగా విద్యా రంగంలో 1,62,75,373 మందికి లబ్ధి కలిగిస్తూ రూ.26,677.82 కోట్లు ఖర్చు చేశాం. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండకూడదు. అందుకే పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ సమూల మార్పు తీసుకువచ్చాం.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

మీ వల్లే మహిళలకు ప్రాధాన్యత 
జగనన్నా.. నేను బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్నాను. నాకు ఒక అక్క ఉంది. నా బాగోగులు, మంచి చెడ్డలు చూసుకోవడానికి ఒక అన్నయ్య ఉంటే బావుండేది అనుకునే వాళ్లం. కానీ విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలతో నాలాంటి ఎంతో మంది చెల్లెళ్లు, తమ్ముళ్లకు మీరు ఒక అన్నగా భరోసా ఇస్తున్నారు. నిజంగా మీరు మాకు దేవుడిచ్చిన అన్నయ్యగా భావిస్తున్నాం. గతంలో ఎక్కడికి వెళ్లినా మీ నాన్న పేరు.. ఆయన ఫోన్‌ నంబర్‌ అని అడిగేవారు. ఇప్పుడు మీ అమ్మ పేరు ఏంటని అడుగుతున్నారు. మీ వల్లే ఈరోజు మహిళలకు ప్రాధాన్యత పెరిగింది. పథకం ఏదైనా సరే అమ్మల ఖాతాల్లో డబ్బు వేస్తున్నందుకు ఆనందంగా ఉంది.   
– రామ లాహిత్య, విద్యార్థిని, అనంతపురం 

సాక్షి, అమరావతి: పేద పిల్లలు పెద్ద చదువులు చదివి గొప్ప ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలన్నదే తన తపన, తాపత్రయం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తూ.. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నామని తెలిపారు. మనసా, వాచా, కర్మణా సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ తోడుగా నిలుస్తున్నామని చెప్పారు. పెద్ద చదువులు చదివితేనే పెద్ద ఉద్యోగాలు వచ్చి ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయట పడతాయని, అప్పుడే వారి తల రాతలు మారతాయని అన్నారు.   జగనన్న విద్యా దీవెనలో భాగంగా ఈ ఏడాది రెండవ విడత దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లను 9,88,437 మంది తల్లుల ఖాతాలకు గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడు బాగా చదవాలని.. వాళ్లకు మన తరఫు నుంచి ఇవ్వదగ్గ ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువే అని తాను చాలా గట్టిగా నమ్ముతానని చెప్పారు. కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే మనం చాలా వెనకబాటులో ఉన్నామన్నారు. రాష్ట్రంలో చదువురాని వారు 2011 జనాభా లెక్కల ప్రకారం 33 శాతం మంది ఉన్నారని,  దేశంలో సగటున 27 శాతం మంది మాత్రమేనని తెలిపారు. ఈ లెక్కన దేశ సగటు కన్నా రాష్ట్రం ఇంకా తక్కువ స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధుల జమ కార్యక్రమంలో వివిధ జిల్లాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
 
పెద్ద చదువులతోనే పేదరికానికి చెక్‌ 
► 18 – 23 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలు ఇంటర్‌ పూర్తయ్యాక ఎంత మంది కాలేజీలకు వెళ్తున్నారని చూస్తే.. ఆశ్చర్యకరమైన నంబర్లు కనిపిస్తున్నాయి. మనం బ్రిక్స్‌ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలతో పోల్చి చూసుకుంటాం. ఇవన్నీ ఒకే రకమైన ఎకానమీ ఉన్న దేశాలు.   
► బ్రెజిల్‌లో 51.8 శాతం, రష్యాలో 83.4 శాతం, చైనాలో 54.7 శాతం పిల్లలు ఇంటర్‌ తర్వాత కాలేజీల్లో చేరుతున్నారు. మన దేశంలో కేవలం 27 శాతం మంది మాత్రమే కాలేజీలకు వెళ్తున్నారు. అంటే దాదాపు 73 శాతం మంది పిల్లలు ఇంటర్‌ తర్వాత కాలేజీల్లో చేరడం లేదు. పిల్లలు పై చదువులు చదవకపోతే, పై స్థాయి ఉద్యోగాలు సాధించలేకపోతే పేదరికాన్ని ఎప్పుడూ పోగొట్టలేం.    

తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదు 
► పెద్ద చదువులు పిల్లలకు అందుబాటులోకి రావాలి. ఆ చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదు. అప్పుడే వారి తల రాతలు మారుతాయి. అప్పుడే మంచి ఉద్యోగాలు వస్తాయి.. పెద్ద జీతాలు వచ్చే అవకాశాలుంటాయి. 
► ఈ పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడానికి.. అధికారంలోకి వచ్చిన వెంటనే నాన్నగారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో ఒక అడుగు ముందుకేస్తే.. జగన్‌ అనే నేను నాలుగు అడుగులు ముందుకు వేశాను.  
► ఆ దిశగా అడుగులు వేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ప్రతి పేదవాడికి, ఓసీల్లో ఉన్న పేద పిల్లలకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం. వారి తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితిని మారుస్తున్నాం. హాస్టల్‌ ఖర్చుల కోసం వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల వరకు ఇస్తున్నాం.   

నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 
► ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ చదువుతున్న పిల్లలకు పూర్తిగా నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో రెండో సంవత్సరం కూడా అడుగులు బాగా ముందుకు వేయగలిగాం. దేశంలో ఎక్కడా లేని విధంగా బకాయిలు లేకుండా, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రతి త్రైమాసికానికి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. 
► వారు కాలేజీలకు వెళ్లి డబ్బులు కట్టే పరిస్థితి ఉంది. దీనివల్ల దాదాపు 10.97 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుంది. అందులో భాగంగా ఈ ఏడాది రెండో విడత కింద రూ.694 కోట్లు విడుదల చేస్తున్నాం.  

గత ప్రభుత్వ బకాయిలూ చెల్లించాం.. 
► మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొట్టమొదటి సంవత్సరంలోనే గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన దాదాపు రూ.1,800 కోట్లు తీర్చడమే కాకుండా, రూ.4,207.85 కోట్లు ఇచ్చాం. ఈ ఏడాది ఎలాంటి బకాయిలు లేకుండా ఏప్రిల్‌ నెలలో మొదటి విడత కింద రూ.671.45 కోట్లు ఇచ్చాం. నేడు (గురువారం) రెండో విడత కింద ఇస్తున్న సుమారు రూ.693.81 కోట్లతో కలిపి ఇప్పటి వరకు నేరుగా మ్తొతం రూ.5,573.11 కోట్లు చెల్లించాం. ఆ తల్లులకు అన్నగా, తమ్ముడిగా, పిల్లలకు మేనమామగా ఈ కార్యక్రమం చేస్తున్నా.  
► విద్యా దీవెన కింద మొదటి విడత ఏప్రిల్‌లో, రెండో విడత ఇవాళ చెల్లించగా, మూడో విడత డిసెంబర్‌లో, నాలుగో విడత ఫిబ్రవరిలో చెల్లిస్తాం. తల్లుల చేతికే డబ్బు ఇచ్చి, వారే నేరుగా ఫీజులు చెల్లించేలా చేశాం. తద్వారా కాలేజీల్లో వసతులు బాగోలేకపోతే తల్లులు తలెత్తుకుని కాలేజీలను నిలదీసే పరిస్థితి కల్పించాం. వారు డబ్బులు కడుతున్నారు కాబట్టి ఆ హక్కు వారికొస్తుంది. ఏమైనా సమస్యలున్నా, సదుపాయాల లోపం ఉన్నా 1902 కు  కాల్‌చేస్తే ప్రభుత్వం వాటి మీద దృష్టి పెడుతుంది.   
► వసతి దీవెన మొదటి విడత ఏప్రిల్‌లో ఇచ్చాం. మళ్లీ డిసెంబర్‌లో రెండో విడత ఇస్తాం. వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ చదువుతున్న వారికి రూ.20 వేలు వసతి, భోజనం కోసం ఇస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన.. రెండు కార్యక్రమాలతో పిల్లలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా.  

అంగన్‌వాడీల నుంచే చదువుల విప్లవం 
► అంగన్‌వాడీల్లో కూడా పీపీ1, పీపీ2 విధానాన్ని తీసుకొచ్చి అక్కడ కూడా చదువుల విప్లవం తీసుకురావాలని తాపత్రయ పడుతున్నాం. పిల్లలకు, గర్భవతులుగా ఉన్న తల్లులకు మంచి పౌష్టికాహారం అందించాలని వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కోసం రూ.1,800 కోట్లు పెట్టాం.  
► ప్రతి అడుగులోనూ చదువుకు అత్యంత పెద్దపీట వేసే ప్రభుత్వం మనది. మన పిల్లలు బాగా చదవాలని అంగన్‌వాడీలను పీపీ1 గా మార్చి అక్కడ నుంచి ఇంగ్లిష్‌ మీడియంను తీసుకు వచ్చాం. సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ను తీసుకు వచ్చాం. పీపీ1 నుంచి డిగ్రీ వరకు అన్ని చదువులు ఇంగ్లిష్‌ మీడియంలో చదివించే గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టగలిగాం. ఈ కార్యక్రమాలన్నింటికీ దేవుడు దీవించాలని, మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నా. 
► ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్,  బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

ఆ ఘటనతో పరిస్థితి మార్చాలని నిర్ణయం 
నేను పాదయాత్ర సాగిస్తున్నప్పుడు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన ఘటన ఇప్పటికీ గుర్తుంది. దారిలో నేను వెళ్తున్నప్పుడు గోపాల్‌ అనే తండ్రి ఇంటి దగ్గర కొడుకు ఫొటోతో ఫ్లెక్సీ పెట్టాడు. నా వద్దకు వచ్చి ‘ఫీజు లక్ష రూపాయలు అయితే ప్రభుత్వం నుంచి అరకొరగా రీయింబర్స్‌మెంట్‌ వస్తోంది. అది కూడా ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. ఫీజు కింద రూ.30 వేలు ఇస్తున్నారు.. మిగతా రూ.70 వేలు ఏటా అప్పు చేయాల్సి వస్తోంది. దీన్ని చూసి తట్టుకోలేక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు’ అని ఆ తండ్రి నాకు చెప్పాడు. ఆ ఘటన నా మనసుని ఎంతగానో కలిచి వేసింది. ఈ ఘటనను నేను ఎప్పటికీ మరిచిపోలేను. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలన్న తపన, తాపత్రయంతోనే అడుగులు వేస్తున్నాం. 

అంబేడ్కర్‌ మార్గంలో ముందడుగు
దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఆ తర్వాతి ప్రభుత్వాలు తూట్లు పొడిచాయి. మీరు వచ్చాక పూర్తి స్థాయిలో కులాలకు అతీతంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు. పాత బకాయిలు కూడా విడుదల చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచనా తీరును ముందుకు తీసుకెళుతున్నారు. మీ కృషి వల్ల గ్రామీణ విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. మీకు ధన్యవాదాలు.
– పినిపే విశ్వరూప్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి 

ఇంగ్లిష్‌ మీడియంతో పేదల దశ మారుతుంది
అన్నా.. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల వల్ల నాలాంటి విద్యార్థులు ఎందరో మంచి చదువులు చదువుకుంటున్నారు. నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని. నా చదువుకి అయ్యే ఖర్చు గురించి మా నాన్న శ్రమ పడకుండా మీరు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా చదువుకుంటున్నాను. ఇప్పుడు బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఇటీవలే క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఇన్ఫోసిన్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇంగ్లిష్‌ మీడియం వల్ల పేద విద్యార్థుల దశ, దిశ మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యార్థులందరి తరఫున మీకు ధన్యవాదాలు.
– తేజ ప్రకాష్, భీమవరం, పశ్చిమగోదావరి 

ఇది మేనమామ గిఫ్ట్‌
జగనన్నా.. నాకు ఇద్దరమ్మాయిలు. ఒంటరి పోరాటం చేస్తున్నాను. వారిని పెంచి పోషించి, చదివించడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. అవమానాలు ఎదుర్కొన్నాను. నా చిన్న కూతురు ఇంజనీరింగ్‌ మూడో ఏడాది చదువుతోంది. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.35 వేలు వచ్చేవి. మిగిలిన డబ్బులకు చాలా ఇబ్బంది పడేదానిని. మీరు సీఎం అయ్యాక పూర్తి ఫీజు ఇస్తున్నారు. పైగా తల్లుల ఖాతాలో వేస్తున్నందుకు చాలా సంతోషం. మేం నేరుగా కాలేజీలకు వెళ్లి బాగోగులు తెలుసుకుంటున్నాం. దీనికితోడు వసతి దీవెన వల్ల మాపై భారం తగ్గింది. ఈ పథకాల వల్ల కలిగే లబ్ధిని పిల్లలు వారి మేనమామ గిఫ్ట్‌ ఇచ్చినట్లుగా సంతోషపడుతున్నారు.
– పి.అంజనాదేవి, విద్యార్థిని తల్లి, గుంటూరు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top