YS Jagan: సీఎం జగన్‌ లేఖతోనే కదలిక  | Sakshi
Sakshi News home page

YS Jagan: సీఎం జగన్‌ లేఖతోనే కదలిక 

Published Fri, May 14 2021 3:20 AM

Cm Jagan Writes Letter For Tech Transfer Covaxin Vaccine - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ రాసిన లేఖతో కోవాగ్జిన్‌ టెక్నాలజీని బదిలి చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే విధంగా కోవాగ్జిన్‌ ఫార్ములాను అనుభవం ఉన్న సంస్థలకు బదిలీ చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇది భారత ప్రభుత్వ ప్రాపర్టీ కాబట్టి పేటెంట్‌ విషయంలో ఎటువంటి వివాదాలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. సీఎం లేఖ రాసిన తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా కేంద్రానికి ఇదే విజ్ఞప్తి చేశారు.

ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌)..  ఎన్‌ఐవీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ), భారత్‌ బయోటెక్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం దేశీయ అవసరాలకు సరిపోనందున సామర్థ్యం ఉన్న ఇతర సంస్థలకు టెక్నాలజీ బదిలీ చేయాలంటూ సీఎం జగన్‌ ఆ లేఖలో సూచించారు. తద్వారా వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి.. అందరికీ వేగంగా వ్యాక్సిన్‌ వేయడానికి అవకాశం లభిస్తుందన్నారు. అప్పుడే కరోనాను త్వరగా కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు. 

వ్యాక్సినేషన్‌లో వేగం పెరగాలి
రాష్ట్రంలో ఒకే రోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసే సామర్థ్యం ఉన్నప్పటికీ సరఫరా లేకపోవడంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగంగా చేపట్టలేకపోతున్న విషయాన్ని కూడా ఆయన లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కోవిడ్‌–19ను కట్టడి చేయాలంటే అర్హులందరికీ వేగంగా వ్యాక్సిన్‌ వేయడం ఒక్కటే మార్గమని, ఇందుకోసం ఉత్పత్తిని పెంచడం తప్ప మరోమార్గం లేదని వివరించారు.

ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్రం అదే దిశగా అడుగులు ముందుకు వేయడంతో సీఎం జగన్‌ చూపించిన చొరవపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాక్సిన్‌ తయారీకి ఆసక్తి ఉన్న సంస్థలు మూడు వారాల్లో ముందుకు రావాలని కేంద్రం పేర్కొనడంతో పలు కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. 

Corona Vaccine: కోవాగ్జిన్‌ ఫార్ములా బదిలీకి ఓకే

Advertisement
Advertisement