రాత్రంతా జాగారం.. పగలంతా ఉపవాసం | Clashes over yoga mats: Andhra pradesh | Sakshi
Sakshi News home page

రాత్రంతా జాగారం.. పగలంతా ఉపవాసం

Jun 22 2025 4:03 AM | Updated on Jun 22 2025 4:04 AM

Clashes over yoga mats: Andhra pradesh

మ్యాట్ల కోసం గొడవపడుతున్న మహిళలు

యోగాసనాలు వేసేందుకు వచ్చిన వారికి అడుగడుగునా కష్టాలే 

అర్ధరాత్రి 12 గంటలకే బస్సుల్లో తరలింపు 

ఉదయం 12 గంటల వరకూ తిప్పలే 

యోగా మ్యాట్ల కోసం ఘర్షణలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘యోగా డే కోసం 5 లక్షల మందికి స్నాక్స్‌ ఏర్పాటు చేశాం. యోగాంధ్ర కార్యక్రమానికి 3.5 లక్షల యోగా మ్యాట్లను కొనుగోలు చేశాం’ విశాఖలోని ఓ హోటల్‌లో ఈ నెల 16న జరిగిన సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం చంద్రబాబు స్వయంగా చేసిన ప్రకటన ఇది. తీరా కార్యక్రమం ముగిసిన తర్వాత 3.03 లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు. అయితే, ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి వరకూ జరిగిన కార్యక్రమంలో యోగాసనాలు వేసేందుకు వచ్చిన ప్రజలకు యోగా మ్యాట్లు దొరక్క దాదాపు అన్ని చోట్లా తోసుకున్నారు. ఒకానొక దశలో ఘర్షణలకు సైతం దిగారు. యోగాసనాలు పూర్తయిన తర్వాత అందిస్తామన్న ఆహారం ప్యాకెట్లూ ప్రజలకు అందలేదు.

కొనుగోలు చేసిన 5 లక్షల ప్యాకెట్లలో సరఫరా చేసినవి కొన్ని మాత్రమే కాగా.. వాటిలో కూడా కొన్నిటిని కూటమి నేతలు సొంత వాహనాల్లో తరలించుకుపోయారు. ప్రతి 100 మందికి కాలకృత్యాలు తీర్చుకునేందుకు టాయిలెట్స్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ, 500 మందికి ఒకే టాయిలెట్‌ ఏర్పాటు చేశారు. దీంతో రాత్రి ఇంటి నుంచి బయలుదేరిన అనేక మంది కాలకృత్యాలు తీర్చుకునేందుకు అగచాట్లు పడ్డారు. కార్యక్రమం ముగిసిన తర్వాత నగరంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కార్యక్రమం కోసం అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరిన పలువురు, చివరకు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కూడా నగరంలోని ట్రాఫిక్‌ నుంచి బయటపడలేని పరిస్థితి నెలకొంది. మొత్తంగా యోగా డే కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలించిన జనమంతా రాత్రంతా జాగరణ.. పగలంతా ఉపవాసాలతో ‘సమస్యాసనాలు’ వేయాల్సి వచ్చింది.   

కాలకృత్యాలకు కష్టాలే 
ఉదయం 6 గంటలకే యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభం అవుతుందని ప్రకటించడంతో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల నుంచి అర్ధరాత్రి నుంచే జనాల తరలింపు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఆయా గ్రామాల్లో అర్ధరాత్రి 12 గంటలకే జనాలను తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2, 3 గంటల ప్రయాణం తర్వాత నేరుగా ఎవరికి నిర్దేశించిన ప్రాంతంలో వారిని వదిలేశారు. అంటే 6 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి తెల్లవారు జామున 3–4 గంటలకే వదిలిపెట్టారు. దీంతో ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు.

ఆహారం ఎక్కడ 
5 లక్షల మంది వస్తారని అంచనా వేసి.. 5 లక్షల స్నాక్స్‌ ప్యాకెట్లు, కేక్, బిస్కట్, చిక్కీ, జ్యూస్, వాటర్‌ బాటిల్‌తో కూడిన ప్యాకెట్లను కొనుగోలు చేశారు. అయితే, వచ్చింది 3.03 లక్షలమందే అయినా కూడా 5 లక్షల స్నాక్స్‌  ప్యాకెట్లు సరిపోకపోవడం గమనార్హం. నిజంగా ఆ స్థాయిలో కొనుగోలు చేశారా? చేసినట్టు లెక్కల్లో చూపారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మధురవాడలోని స్టేడియం వద్ద ఉన్న స్నాక్స్‌ ప్యాకెట్లను కూడా కూటమి నేతలు వాహనాల్లో తరలించుకుపోయారు. ోగాంధ్ర కార్యక్రమానికి హాజరైన వారు మిగిలిన కొద్దిపాటి ప్యాకెట్ల కోసం తోసుకోవాల్సి వచ్చింది.

ఇక 3.5 లక్షల యోగా మ్యాట్లను కొనుగోలు చేశామన్న ప్రభుత్వం.. వచ్చిన 3.03 లక్షల మందికి కూడా సక్రమంగా పంపిణీ చేయలేకపోయింది. వాస్తవానికి 49 వేల యోగా మ్యాట్లు మిగిలిపోవాలి. అయితే, జోడుగుళ్లపాలెం ప్రాంతంలో మ్యాట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఎగబడ్డారు. ఒకరినొకరు కొట్టుకునేంత పనిచేశారు. ఎంవీపీలోని హెల్త్‌ ఎరీనా వద్ద కూడా యోగా మ్యాట్లు సరిపడా లేకపోవడంతో ఒకరికొకరు తోసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement