ఫేక్‌ వీడియోతో బాబు మార్క్‌ కుట్ర! | Chandrababu Mark conspiracy with fake video | Sakshi
Sakshi News home page

ఫేక్‌ వీడియోతో బాబు మార్క్‌ కుట్ర!

Jun 26 2025 5:20 AM | Updated on Jun 26 2025 7:56 AM

Chandrababu Mark conspiracy with fake video

జగన్‌ ప్రయాణిస్తున్న కారు కింద సింగయ్య పడినట్లుగా టీడీపీ దర్శకత్వంలో ఎల్లోమీడియా, పోలీసులు ప్రచారం చేస్తున్న ఫేక్‌ వీడియో , ప్రమాదం జరిగిన 30 నిమిషాల తర్వాత కూడా కాలుపై కాలు వేసుకొని మామూలుగా మాట్లాడుతున్న సింగయ్య, ఈ రెండింటినీ చూస్తుంటే ఇదంతా టీడీపీ, ఎల్లో మీడియా పన్నాగమేనని ఇట్టే తెలుస్తోంది.

4  టన్నుల బరువున్న వాహనం సరిగ్గా ఓ వ్యక్తి మెడపై నుంచి వెళ్తే వెంటనే చనిపోడా? 

తర్వాత కాలుపై కాలు వేసుకుని పడుకుని మాట్లాడే అవకాశం ఉంటుందా? 

30 నిమిషాలపాటు అంబులెన్స్‌ వచ్చే వరకు మాట్లాడటం సాధ్యమా?

ఆ వ్యక్తి మెడపై నుంచి కారు ఎక్కి దిగిన తర్వాత వీడియో ఏమైంది?

ఆ వీడియోలో విశ్వసనీయత ఎంత? ఏఐ ద్వారా సృష్టించారని అనుమానం 

దోక్కుపోయిన గాయాలకే చనిపోయాడా? చిన్న గాయాలే ఉన్నాయన్న డాక్టర్‌  

ఈ అనుమానాలు, ఎస్పీ పరస్పర ప్రకటనలే ఇది కుట్ర అనడానికి నిదర్శనం

సింగయ్యను పచ్చ బ్యాచ్‌ చంపేసిందా? వరుస పర్యటనలతో జనంలోకి దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నిలువరించడానికే కూటమి ప్రభుత్వం ఇలా పన్నాగం పన్నిందా? జగన్, పార్టీ నేతలపై దొంగ కేసులు బనాయించింది ఇందుకేనా? తాజాగా బయటికి వచ్చిన వీడియోలు, వైద్యులు రాసిన శవ పంచనామా, పోలీసులు తీసుకున్న దొంగ సాక్షి వాంగ్మూలం... అన్నీ చూస్తే అవుననే భావించాల్సి వస్తోంది. 4 టన్నుల బరువున్న వాహనం మీద ఎక్కితే బతుకుతారా? ఇది గుద్దితే బాధితుడు కాలుపై కాలు వేసుకుని పడుకునే అవకాశం ఉందా? లేదని ఎవరికైనా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వానికి, మడుగులొత్తే పోలీసులకు అర్థం కాదు. ఎందుకంటే జగన్‌మోహన్‌రెడ్డిని ఏదో రకంగా కేసులో ఇరికించడమే వారి కుట్ర కాబట్టి..   

సాక్షి ప్రతినిధి, గుంటూరు:  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదాన్ని ఎల్లో మీడియా ఎంత దుర్మార్గంగా చిత్రీకరించిందో, చంద్రబాబు ప్రభుత్వం అంతకంటే దుర్మారంగా వ్యవహరించింది. వైఎస్‌ జగన్‌ను ఈ కేసులో ఇరికించేందుకు పక్కా కుట్ర పన్ని.. పోలీసుల ద్వారా వ్యవహారం నడిపించింది. ప్రమాదం జరిగిన వెంటనే కాన్వాయ్‌తో సంబంధం లేని వాహనం ఢీకొట్టడం వల్లే సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని స్వయంగా జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఆ వాహనాన్ని సీజ్‌ చేసి డ్రైవర్‌కు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపారు. మూడు రోజుల తర్వాత సోషల్‌ మీడియాలో వచి్చన ఒక ఫేక్‌ వీడియో ఆధారంగా జగన్‌ వాహనం కిందే సింగయ్య పడ్డాడంటూ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో మాట మార్చారు. కాన్వాయ్‌ వాహనం నడుపుతున్న ప్రభుత్వ డ్రైవర్‌ రమణారెడ్డి ఏ1గా, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ2గా, ఆయన పీఏ కె.నాగేశ్వరరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజినిలను ఈ కేసులో చేర్చారు. అయితే పోలీసులు, ఎల్లో మీడియా చెబుతున్న, చూపిస్తున్న వీడియో విశ్వసనీయతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  

4 టన్నుల బరువున్న వాహనం ఎక్కితే కాలు మీద కాలు వేసుకుని మాట్లాడుతాడా?
మామూలు ఫార్చూనర్‌ వాహనం రెండు వేల కిలోలు ఉంటుంది. అదే బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనమైతే 3.5 టన్నుల బరువు ఉంటుంది. అందులో ఉన్న మనుషులతో కలిపి 4 టన్నులు ఉంటుంది. ఇంత బరువున్న వాహనం ఒక మనిషి మెడపై నుంచి వెళితే స్పాట్‌లోనే నుజ్జునుజ్జుగా మారి చనిపోతాడు. అలాంటిది ఆ వాహనం కిందే పడ్డాడని చెబుతున్న సింగయ్య స్వల్ప గాయాలతో అరగంటకు పైగా స్పృహలోనే ఉండటంతో పాటు కాలుమీద కాలేసుకుని పడుకుని తనను ఆసుపత్రికి తీసుకువెళ్లమని అడుగుతున్న వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి. 


స్థానికులు ప్రైవేటు వాహనంలో అతడ్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా పోలీసులు ఒప్పుకోలేదు. దాదాపు 30 నిమిషాల తర్వాత అంబులెన్స్‌ వచ్చే వరకు ఆగి.. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు. అప్పటికి కూడా అతను స్పృహలోనే ఉన్నాడు. అతని వంటిపై స్వల్ప గాయాలే కనపడుతున్నాయి. వీడియో కూడా అతను కారు టైరు కింద పడినంత వరకే ఉంది. ఆ తర్వాత అతన్ని బయటకు తీసిన వీడియో ఎందుకు బయటకు రాలేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కాబట్టి, ఏఐ టెక్నాలజీతో ఈ వీడియోను సృష్టించినట్లు స్పష్టం అవుతోంది.  

చిన్న గాయాలకే చనిపోయాడా? 
మృతుడి శరీరంపై చిన్న చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయని మార్చురీలో వైద్యులు నోట్‌ చేశారు. ఎడమ బుగ్గ, దవడ, కుడి కంటి కింద, ఛాతిపై కుడి వైపు, కుడి మోచేయి వెనుక నుంచి అరచేయి వెనుక భాగం వరకు, మోకాళ్ల వద్ద దోక్కుపోయి తోలు లేచిన గాయాలు ఉన్నాయని వైద్యులు స్పష్టంగా పేర్కొన్నారు. ఇంత చిన్న గాయాలు ఉన్నప్పుడు అతను అదే రోజు చనిపోయే అవకాశం లేదని, సింగయ్య వంటిపై చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయని ప్రత్యక్ష సాక్షి, హైకోర్టు న్యాయవాది కోటేష్‌ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీన్నిబట్టి ఇది కుట్ర అని స్పష్టంగా తెలుస్తోంది.  

దుర్మార్గానికి పరాకాష్ట
పోలీసులు తీసుకున్న సాక్షి వాంగ్మూలం దారుణంగా ఉంది. సింగయ్య వాహనం కింద పడిన తర్వాత కూడా డ్రైవర్‌ను కారులో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డితో పాటు మిగిలిన వారు ఆపకుండా పోనీయమంటూ ఆదేశాలు ఇచ్చినట్లుగా రాశారు. అసలు వీఐపీ వెహికల్‌లో ఉన్న వారు డోర్‌ గ్లాస్‌లు వేసిన కారులో ఏం మాట్లాడారో బయటి వారికి ఎలా తెలుస్తుంది? సంఘటన జరిగిన సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కారు ఫుట్‌ రెస్ట్‌ ప్లేట్‌పై నిలబడి బయటి ప్రజలకు అభివాదం చేస్తుండటం ఆ ఫేక్‌ వీడియోలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. 

దీంతో సాక్షుల పేరుతో అబద్ధపు వాంగ్మూలాలు సృష్టించి ఈ కేసును బనాయించినట్లు కనపడుతోందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి వేలాది మంది ప్రజలకు అభివాదం చేస్తూ.. వారితో మమేకమైన తీరు స్పష్టంగా కనిపిస్తుంటే.. ఆయన కారు కింద ఓ వ్యక్తి పడినప్పటికీ.. వాహనం పోనివ్వమని చెప్పారంటూ ఎఫ్‌ఐఆర్‌లో రాయడం దుర్మార్గానికి పరాకాష్ట. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు.   

Advertisement
 
Advertisement
Advertisement