మగ్గం నేస్తున్న దృశ్యం
ఏడాదిగా అమలు కాని ఉచిత విద్యుత్ జీఓ
చేనేత బతుకుల్లో చీకట్లు
గడ్డు పరిస్థితిలో చేనేత రంగం
అమలుకు మీన మేషాలు లెక్కిస్తున్న బాబు సర్కారు
‘మేం అధికారంలోకి వస్తే చేనేత బతుకుల్లో వెలుగులు నింపుతాం.. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాం..ఇదీ నాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ.. గద్దె నెక్కిన తరువత ఆ హామీ తూచ్ అన్న చందంగా మారింది. బాబు హామీల అమలుకు ప్రతిపక్షాల ఒత్తిడితో తూతూ మంత్రంగా చేనేతకు ఉచిత విద్యుత్ జీఓ.. ఏడాదిగా అమలులోకి రాని గవర్నమెంట్ ఆర్డర్. వెరసి నెలానెలా పెరుగుతున్న విద్యుత్ చార్జీలతో చేనేత బతుకుల్లో చీకట్లు అలుమున్నాయి. పెట్టుబడులు భరించలేక నేత పనులు సాగక.. పండుగపూటా పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది.
వెంకటగిరి(సైదాపురం): ఉచిత విద్యుత్ జీఓ ఇచ్చి ఏడాది కావస్తున్నా అమలు కాకపోవడంతో కాంతి లేని సంక్రాంతిని జరుపుకోవాల్సి వచ్చిందని నేతన్నలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవర్ లూమ్స్కు మంచి రోజులు వస్తాయని నేతన్నలు ఆశించారు. అయితే ప్రభుత్వం కొలువు దీరి రెండేళ్లు కావస్తున్నా విద్యుత్ బాదుడు కొనసాగుతూనే ఉంది. కంటి తుడుపుగా జీఓ ఇచ్చి చేతులు దులుపుకోవడంపై నేతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీఓ అమలుపై ఇప్పటికే విద్యుత్ అధికారులకు వినతులు ఇచ్చిన నేత కార్మికులు ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు.
ఉచిత విద్యుత్ జీఓతో నేతన్న జీవితాల్లో కొత్త వెలుగులు విరజిమ్మాతాయనుకుంటే గాఢాందకారం అలుముకుంది. కొత్త ఏడాదిలోనైనా చంద్ర కాంతులతో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలన్న నేతన్నలకు నిరాశే మిగిలింది. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వ్యవసాయం తర్వాత అతి పెద్ద రంగం చేనేత రంగం. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ రంగం ప్రస్తుతం దయనీయ పరిస్థితి ఎదుర్కొంటోంది. లయబద్ధంగా వినడే పవర్లూమ్స్ ధ్వని వినిపించడం తగ్గిపోతుంది. ఇందుకు వివిధ సుంకాల పేరిట పెరిగిన విద్యుత్ చార్జీలే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. చాలీ చాలని కూలీలతో తమ జీవితాలు అప్పుల పాలవుతన్నాయనని నేత కార్మీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మార్చి 26వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన ఉచిత విద్యుత్ జీఓ నంబర్ 44కు ఏడాది కావస్తున్న అమలు కాలేదు.
ఒత్తిడి తెచ్చినా...
అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఉచిత విద్యుత్ హామీ నెరవేర్చాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో దిగివచ్చిన బాబు ప్రభుత్వం గత ఏడాది మార్చిలో జీఓను విడుదల చేసింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికుల వాస్తవ సంఖ్యను పవర్ లూమ్ యానిట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించి చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా నూలు, పట్టు చేనేత కుటుంబాలు 2.79 లక్షల మంది ఉండగా కేవలం 93 వేల మందిగా చూపించారు. అలాగే మరగ్గాలు 81 వేలు ఉండగా 10,534 ఉన్నట్లు చూపారు. ఈ లెక్కల ప్రకారం చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు పవ్లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు జీఓలో స్పష్టం చేశారు.
ఇందుకు ఏడాదికి సుమారు రూ. 125 కోట్లు ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. జీవో అమలుకు డిస్కామ్ సంస్థలు బడ్జెట్ మంజూరు చేయాలని ప్రతిపాదించాయి. అయితే నిధులు విడుదల కాకపోవడంతో నేటికీ జీఓ అమలకు నోచుకోలేదు. ప్రతి నెలా యథావిధిగా పెరిగిన విద్యుత్ చార్జీలు బిల్లును అందుకుంటున్న నేతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ఇంధన శాఖకు తగిన బడ్జెట్లో నేత కార్మీకులకు ఉచిత విద్యుత్ జీఓ విడుదలతోపాటు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ఏడాది గడిచినా జీఓ అమలు కావడంలేదు. దీనిపై అధినేతను అడగలేక అడుగుతున్నవారికి సమా«ధానాలు చెప్పలేక స్థానిక నేతులు తికమక పడుతున్నారు.
గత ప్రభుత్వంలో ఆదుకున్న నేతన్న నేస్తం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందించింది. అంతేగాకుండా విద్యుత్చార్జీలు నుంచి 96 పైసల యూజర్స్ చార్జీలను తగ్గించి వెసులుబాటు కలి్పంచింది. గత ఎన్నికల సమయంలో ప్రతి పక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు బహిరంగ సభల్లో చేనేత పవర్లూమ్స్ కార్మీకులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామంటూహామీ ఇచ్చారు. దీనిని గుడ్డిగా నమ్మిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేత కార్మీకులు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించారు. అయితే అధికారంలోకి వచ్చిన బాబు మాత్రం నాటి ఎన్నికల హామీకి ఎగనామం పెట్టడంతో పాటు వివిధ సుంకాలపేరిట విద్యుత్ చార్జీలను పెంచి నేత కార్మీకుల నడ్డి విరుస్తున్నారు.
ఉచిత విద్యుత్ అమలు చేయాలి
ఉచిత విద్యుత్ పేరిట జీఓ ఇచ్చి ఏడాదవుతున్నా అమలు చేయకపోవడం దారుణం. పెరిగిన విద్యుత్ చార్జీలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. పక్క రాష్ట్రంలో తమిళనాడులో 15 ఏళ్లుగా ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు. ఇక్కడ మా పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఉచిత విద్యుత్ జీఓను వెంటనే అమలు చేయండి.
– బాలాజీ, నేత కార్మీకుడు, వెంకటగిరి
నేతన్న నేస్తం అమలు చేయాలి
గత ప్రభుత్వం అమలు చేసిన నేతన్న నేస్తం పథకాన్ని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అమలుచేయాలి. ఈ పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు ఏడాదికి రూ. 24వేలు ఆర్థిక సాయం అందడంతో మా కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలిగింది. ఉచిత విద్యుత్తోపాటు నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేసి ఆదుకోవాలి.
–రవి, నేత కార్మీకుడు, వెంకటగిరి
ప్రత్యేకపోరాటానికి సిద్ధం
ఉచిత విద్యుత్పై గత ఏడాది మార్చిలో జీఓ విడుదల చేసినప్పటీకీ పథకం అమలు చేయకపోవడం నేత కార్మీకుల ను మోసం చేయడమే. దీనిపై ఇప్పటికే పలుచోట్ల అధికారులకు వినతి పత్రం సమర్పించాం. అయినా ఫలితం శూన్యం. విధిలేక అన్నీ కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పారీ్టలతో కలసి ప్రత్యక్ష పోరాటానికి నేత కార్మికులు సిద్ధమవుతున్నారు.
– కూన మల్లిఖార్జునరావు


