ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభం | Beginning of the process of AP new districts | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభం

Aug 24 2020 4:01 AM | Updated on Aug 24 2020 11:46 AM

Beginning of the process of AP new districts - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అధికారిక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25  – 26కు పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. జిల్లాల పునర్విభజన ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీ (ఎస్‌ఎల్‌సీ), వివిధ అంశాలపై అధ్యయనం కోసం నాలుగు సబ్‌ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. వీటికి  సహకరించేందుకు  కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా కమిటీలను నియమించాలని ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం జీవో జారీ చేశారు.  

ఎస్‌ఎల్‌సీ బాధ్యతలివీ.. 
► ఎస్‌ఎల్‌సీ కోసం ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ (ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌)లో సచివాలయం ఏర్పాటు కానుంది. 
► సబ్‌ కమిటీల నుంచి ఎస్‌ఎల్‌సీ సమాచారం õసేకరించి జిల్లా పునర్వ్యవస్థీకరణ  పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.  జీఐఎస్‌ మ్యాపులు లాంటివి సమకూర్చాలి. జిల్లా పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ జరిగిన ప్రాంతాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేసి డేటా తెప్పించుకోవాలి. 
► నిపుణులు, ఏజెన్సీలు, కన్సల్టెంట్ల సేవలను వినియోగించుకోవచ్చు. ఎస్‌ఎల్‌సీ సచివాలయం ప్రాథమికంగా ఆరు నెలలు కొనసాగుతుంది. తర్వాత అవసరాన్ని బట్టి నిర్ణయిస్తారు. 
  
నాలుగు సబ్‌ కమిటీల విధులివీ.. 
► జిల్లాల సరిహద్దులు, న్యాయ పరమైన అంశాల అధ్యయన బాధ్యతలను మొదటి ఉప సంఘం పర్యవేక్షిస్తుంది.  
► ప్రస్తుత పరిస్థితి/ సిబ్బంది పునర్విభజన అధ్యయన బాధ్యతలను రెండో సబ్‌ కమిటీ నిర్వర్తిస్తుంది. 
► ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయన బాధ్యతలను మూడో సబ్‌ కమిటీ నిర్వహిస్తుంది.  
► ఐటీ/ సాంకేతిక అంశాల అధ్యయన బాధ్యతలను నాలుగో సబ్‌ కమిటీ చేపడుతుంది.  
     
జిల్లా కమిటీల్లో ఉండేది వీరే.. 
► కలెక్టరు అధ్యక్షతన పనిచేసే డీఎల్‌సీకి జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ, రైతు భరోసా, రెవెన్యూ) సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఎస్పీ, జిల్లా విద్యా శాఖాధికారి, వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా పరిషత్‌ సీఈవో, ముఖ్య ప్రణాళికాధికారి, ట్రెజరీ ఆఫీసర్, కలెక్టరు ప్రతిపాదించిన అధికారి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.  
► అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ ముఖ్య కార్యదర్శులు/కార్యదర్శులు/ విభాగాధిపతులు ఎస్‌ఎల్‌సీ సమావేశాలకు హాజరై సమాచారాన్ని సకాలంలో అందించాలని సీఎస్‌ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement