‘కొమ్మినేని’ అరెస్ట్‌.. అరాచకాలకు పరాకాష్ట | Bad publicity against YSRCP under Chandrababu guidance says sajjala | Sakshi
Sakshi News home page

‘కొమ్మినేని’ అరెస్ట్‌.. అరాచకాలకు పరాకాష్ట

Jun 10 2025 4:57 AM | Updated on Jun 10 2025 4:57 AM

Bad publicity against YSRCP under Chandrababu guidance says sajjala

‘సాక్షి’ టీవీ డిబేట్‌లో జర్నలిస్ట్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించారు

తన వ్యాఖ్యలపై కృష్ణంరాజు క్షమాపణలు చెప్పారు 

సాక్షి టీవీ, వైఎస్సార్‌సీపీ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించాయి 

ఒక పథకం ప్రకారం కృత్రిమ ఆందోళనలు 

చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం  

డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ వివాదం

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం

సాక్షి, అమరావతి: సాక్షిటీవీ డిబేట్‌లో జర్నలిస్ట్‌ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఒక పథకం ప్రకారం మూడు రోజులుగా చేస్తున్న కృత్రిమ ఆందోళనలకు పరాకాష్ట సీనియర్‌ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే..  

వ్యాఖ్యలపై దుష్ప్రచారం 
సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి టీవీలో నిర్వహించిన డిబేట్లో సీనియర్‌ జర్నలిస్ట్‌ కృష్ణంరాజు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథ­నాన్ని ఉటంకిస్తూ అన్న మాటలను ప్ర­ణాళిక ప్రకా­రం వివాదం చేయాలనుకున్న టీడీపీ, కృష్ణంరాజు అమరావతి గురించి తప్పుగా వ్యాఖ్యలు చేశారనే దు్రష్ప­చారాన్ని చేపట్టింది. సీఎం చంద్రబాబు తన ట్వీట్‌లో కృష్ణంరాజు వీడియోను పోస్ట్‌ చేసి తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగానే టీడీపీ, ఎల్లో మీడియా అదేపనిగా రాద్ధాంతం చేశాయి.

కృష్ణంరాజు క్షమాపణ చెప్పినా..  
తన వ్యాఖ్యలపై కృష్ణంరాజు క్షమాపణలు చెప్పారు. టీవీ డిబేట్లలో ఎవరు ఏ అభిప్రాయం చెప్పినా అది వారి వ్యక్తిగతమే. వాటిని టీవీ చానల్‌కుగానీ, ఆ కార్యక్రమ ప్రజెంటర్‌కుగానీ ఆపాదించడం తగదు. టీడీపీ అనుకూల చానల్స్‌లో వైఎస్‌ జగన్, వైఎస్సార్‌సీపీ నేతల వ్యక్తిత్వాలను హననం చేస్తూ వందలకొద్ది డిబేట్లు జరిగాయి. అధికారంలో ఉన్నప్పుడూ వైఎస్సార్‌సీపీ ఇలాంటి డిబేట్లను పట్టించుకోలేదు. ఏ టీవీపైనా, పేపర్‌పైనా కక్షపూరితంగా వ్యవహరించలేదు. అసమర్థ పాలకులే ఇలాంటి అంశాలతో డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడతారు.   

ప్రణాళిక ప్రకారం వ్యక్తిగత దాడి
సాక్షి టీవీ డిబేట్‌ను ప్రణాళిక ప్రకారం వివాదం చేసిన టీడీపీ.. వైఎస్‌ జగన్, వైఎస్‌ భారతిపై వ్యక్తిగత దాడి ప్రారంభించింది. జర్నలిస్టు వ్యాఖ్యలను సమర్థించలేదని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని సాక్షి టీవీ చాలా స్పష్టంగా ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్‌సీపీ కూడా జర్నలిస్టు వ్యాఖ్యలను ఖండించింది. కొమ్మినేనీ  క్షమాపణలు చెప్పారు. 

అయినా చంద్రబాబు కనుసన్నల్లోనే టీడీపీ సాక్షిటీవీ కార్యాలయాలపై దాడులకు తెగబడుతోంది. పరోక్షంగా అమ­రావతి పరువును టీడీపీనే బజారుకీడ్చింది. కొమ్మినేనిని గతంలోనూ ఎన్టీవీ ఉద్యోగం నుంచి చంద్రబాబు తొలగింపజేశారు. చంద్రబాబును పొగిడితేనే జర్నలిస్టులకు మనుగడ ఉంటుందనే సందేశం ఇస్తున్నారు. దీనిపై ప్రజలు, జర్నలిస్టులు, మేధావులు, ప్రజాసంఘాలు గళమెత్తాలి. 

హామీలు నెరవేర్చే వరకూ నిరసన గళం
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ కూటమి ప్రభుత్వంపై నిరసన గళమెత్తుతూనే ఉంటా­మని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యా­లయంలో సోమవారం యువజన విభాగం రాష్ట్ర కమిటీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.

క్రియా­శీల పోరాటాలకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పా­రు. ఈ కా­ర్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ యువ­జన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, యూత్‌ వింగ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్దార్ధ్‌ రెడ్డి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement