ఈ ఆటోడ్రైవర్ది ఎంత మంచి మనసు..!
పెరవలి(పశ్చిమగోదావరి జిల్లా) : ఆటో డ్రైవర్ నిజాయితీగా వ్యవహరించి ఆటోలో మర్చిపోయిన బంగారు నగలు, నగదును మహిళకు అందించాడు. పెరవలి గ్రామానికి చెందిన పడాల స్వప్న పెనుగొండ వెళ్లేందుకు శనివారం ఉదయం ఆటో ఎక్కింది. ఆమె బ్యాగ్లో 10 కాసుల బంగారు నగలు, నగదు ఉన్నాయి. స్వప్న గమ్యానికి చేరుకొన్న తరువాత ఆటోలో బ్యాగ్ వదిలి వెళ్ళిపోయింది. ఆటోలో బ్యాగ్ ఉండటం గమనించిన డ్రైవర్ అడపా రమేష్ కొద్దిసేపు పెనుగొండలోనే ఉండి ఎవరైనా వస్తారని ఎదురు చూశాడు.
ఎవరూ రాకపోవడంతో పెరవలి పోలీస్స్టేషన్కు వచ్చి బ్యాగ్ అప్పగించాడు. ఆటో వెళ్ళిన గంటసేపటికి బ్యాగ్ పోగొట్టుకున్న స్వప్న ఆటో కోసం వెతకడంతో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు జరిగిన విషయం తెలిపారు. ఇంతలో ఎస్సై సూర్య భగవాన్ ఆమెకు ఫోన్ చేసి బ్యాగ్ పోలీస్స్టేషన్లో ఉందని చెప్పారు. దీంతో స్వప్న స్టేషన్కు వచ్చి బ్యాగ్లో ఉన్న నగలు, నగదు పరిశీలించి అన్ని ఉన్నాయని చెప్పటంతో డ్రైవర్ రమేష్ చేతుల మీదుగా ఆమెకు అందించారు. ఆటో డ్రైవర్ నిజాయతీని అందరు అభినందించారు.