విజయవాడ: పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని రైతులు ఆందోళన బాటపట్టారు. దొడ్డిదారిన పెంచిన ఆక్వా ఫీడ్ను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేస్తున్నారు.
ఆక్వా రైతుల నిరసన కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి మెయిన్ సెంటర్లో ధర్నా చేశారు. తమకు ఉరితాళ్లే శరణ్యం అంటూ ఉరితాళ్ళు మెడకు బిగించుకుని ఉండి మెయిన్ సెంటర్లో నిరసన తెలిపారు. సిండికేట్ వ్యవస్థను అరికట్టాలని, ఆక్వారైతులకు సరైన ధర కల్పించి అప్సడ చట్టాన్ని అమలు చేయాలని నినాదాలు చేశారు. ఉండి మండల తాసిల్దార్కు వినతి పత్రం అందజేశారు ఆక్వా రైతులు. దీనికి వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ నేతలు సంఘీభావం తెలిపారు.
వనామీ రకం మేత పై కేజికి 10 రూపాయి పెంపు, టైగర్ ప్రాన్ మేత ధరలు 12 రూపాయల పెంపును వ్యతిరేకిస్తూ ఆక్వా రైతులు ధర్నా చేపట్టారు. టన్ను వనామీ ఫీడ్కు రూ. 10 వేలు, టైగర్ ప్రాన్ ఫీడ్కు రూ. 12 వేలు పెంచి ఆక్వా రైతుల నడ్డివిరిచే యత్నం చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఈ పెంపును ఏ మాత్రం అంగీకకరించబోమని రైతులు పదే పదే చెప్పినప్పటికీ ఏకపక్షంగా టీడీపీకి చెందిన కంపెనీలు ధరలు పెంచేశాయని ధ్వజమెత్తారు. అప్పడాతో సంబంధం లేకుండా మొండిగా నిర్ణయం తీసుకోవడాన్ని రైతులు తప్పుబడుతున్నారు.
ఇప్పటికే రొయ్య రేటు పతనం కావడం ఒకటైతే పెంచిన ధరలతో పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. కేజీ రొయ్య ఉత్పత్తికి 280/- వరకు ఖర్చు.. ప్రస్తుతం కేజీ వనామి రొయ్య మార్కెట్ ధర 240 ఉండటంతో తాము సాగు ఎలా చేసేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వం దిగిరాకుంటే.. చలో అమరావతికి పిలుపునిస్తామని ఆక్వా రైతుల హెచ్చరిస్తున్నారు.

ఏలూరు జిల్లాలోని భీమడోలు మండలం గుండుగొలనులో ఆక్వా రైతుల సమావేశమయ్యారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పాల్గొన్నారు. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ఆక్వా రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


