నో రూల్‌.. ఇది ఆర్జేడీల డీల్‌ | Appointment of guest faculties through illegal means | Sakshi
Sakshi News home page

నో రూల్‌.. ఇది ఆర్జేడీల డీల్‌

Jun 30 2025 3:52 AM | Updated on Jun 30 2025 3:52 AM

Appointment of guest faculties through illegal means

జోన్‌–1, 2 ఆర్జేడీ జారీ చేసిన జాబితాలో ఒక అభ్యర్థికి అచ్చెన్నాయుడు సిఫారసు చేశారని పేర్కొన్నారు

ఇంటర్మీడియట్‌ విద్యామండలిలో అవినీతి బాగోతం 

అక్రమ మార్గంలో గెస్ట్‌ ఫ్యాకల్టీల నియామకం

మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యేల సిఫార్సులతో ముందుగానే పోస్టింగ్స్‌  

నాలుగు జోన్లలో ఆర్జేడీల చేతివాటం.. అధికారం లేకున్నా ఆర్డర్లు 

రాష్ట్రవ్యాప్తంగా 1,070 మంది గెస్ట్‌ ఫ్యాకల్టీలు 

పోస్టుకు రూ.25 వేల చొప్పున వసూలు చేసినట్టు విమర్శలు 

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్‌ విద్యామండలిలో మరో అవినీతి బాగోతం బయటపడింది. జూనియర్‌ కళాశాలల్లో అవసరమైన చోట ప్రిన్సిపాల్స్‌ మాత్రమే నియమించాల్సిన గెస్ట్‌ ఫ్యాకల్టీని రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్లు (ఆర్జేడీలు) నియమించేశారు. జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థులు చేరికలు పూర్తయ్యాక, అవసరమైన చోట గంటల లెక్కన వేతనంపై నియమించాల్సిన గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులను ముందుగానే అమ్మేశారు. అదీ, గతేడాది పనిచేసిన గెస్ట్‌ ఫ్యాకల్టీలలో డబ్బులిచ్చిన వారికి, సిఫారసు లేఖలు తెచ్చిన వారికి స్థానికంగా అవకాశం కల్పించి.. మిగిలిన వారిని మాత్రం జిల్లాలు దాటించి నియమించారు. 

అసలు గెస్ట్‌ ఫ్యాకల్టీల నియామకంపై కమిషనరేట్‌కు కనీసం నోట్‌ఫైల్‌ గాని, సమాచారం గాని ఇవ్వకుండానే ఆర్జేడీలు దందా నడిపించారు. రాష్ట్రంలోని 4 జోన్లలో మొత్తం 1,070 మందిని ఇలా నియమించినట్టు తెలుస్తోంది. ఈ నియామకాలకు గాను ఒక్కో గెస్ట్‌ ఫ్యాకల్టీ నుంచి రూ.20 వేల నుంచి రూ.25 వేలు వసూలు చేసినట్టు విమర్శలు వస్తున్నాయి. జోన్‌–1, 2లలో మంత్రి అచ్చెన్నాయుడి సిఫారసుతో పోస్టింగ్‌ ఇచ్చినట్టు నియా­మక ఆదేశాల్లో పేర్కొనడం చూస్తుంటే.. అవినీతి ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. 

నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ నియామకాల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీని తీసుకోలేమని కొందరు ప్రిన్సి­పాల్స్‌ అభ్యంతరం వ్యక్తం చేయగా.. త్వరలో పత్రికా ప్రకటనలు జారీచేసి.. తాము ఎంపిక చేసిన వారినే తీసుకోవాలని ఆర్జేడీలు ప్రిన్సిపాల్స్‌పై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన రెగ్యులర్‌ లెక్చరర్ల బదిలీల్లోనూ అవినీతికి పాల్పడ్డ ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు, ఆర్జేడీలు ఇప్పుడు రెండు నెలల ముందే ఎలాంటి బడ్జెట్, నోటిఫికేషన్‌ లేకుండానే నియామకాలు చేపట్టడం చూస్తుంటే కూటమి ప్రభుత్వంలో ఇంటర్మీడియట్‌ విద్యామండలి ఎంతగా అవినీతిలో కూరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చని ప్రిన్సిపాల్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రిన్సిపాళ్ల ఆందోళన
గెస్ట్‌ ఫ్యాకల్టీకి ఇచ్చే గౌరవ వేతనం స్థానిక కాలేజీ సాధారణ బడ్జెట్‌ నుంచి చెల్లిస్తారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని కాలేజీలకు ఎంత బడ్జెట్‌ అవసరమో ఏటా కమిషనరేట్‌ నుంచి వచ్చిన వివరాల ఆధారంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఆ తర్వాతే ఈ నియామకాలు చేయాలి. కానీ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్డగోలుగా నియామకాలపై కొందరు ప్రిన్సిపాల్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గెస్ట్‌ అభ్యర్థులు నియామక పత్రాలతో కాలేజీలకు రావడంతో జోన్‌–3లో గుంటూరు జిల్లాలోని అచ్చంపేట, బల్లికురవ, దాచేపల్లి జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ ప్రక్రియను అంగీకరించేది లేదని ఆర్జేడీలకు తేల్చిచెప్పారు. దీంతో పత్రికా ప్రకటన జారీ చేసి ఎన్ని దరఖాస్తులు వచ్చినా వీరినే తీసుకోవాలాని ఆదేశించినట్టు తెలిసింది. ఇక జోన్‌–1, 2 ఆర్జేడీ ఏకంగా రెండు రోజుల క్రితం 45 మంది గెస్ట్‌ ఫ్యాకల్టీలను నియమిస్తున్నట్టు జాబితా ప్రకటించారు. 

ఇందులో సిఫారసు, డబ్బులిచ్చిన వారిని స్థానికంగాను, మిగిలిన వారిని ఇతర జిల్లాల్లో నియమించారు. మంత్రి అచ్చెన్నాయుడు సిఫారసు చేసినట్టు ప్రకటించారు. తమకు అన్యాయం చేశారని బాధిత గెస్ట్‌ ఫ్యాకల్టీ రాజమండ్రిలోని ఆర్జేడీ కార్యాలయాన్ని ముట్టడించడంతో త్వరలో సర్దుబాటు చేస్తామని నచ్చజెప్పి పంపినట్టు సమాచారం. 

ఆడ్మిషన్లు పూర్తవలేదు.. నోటిఫికేషన్‌ కూడా లేదు
రాష్ట్రంలో 475 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. ఏటా ఆయా కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశాలు పూర్తయ్యాక సబ్జెక్టు బోధనకు రెగ్యులర్, కాంట్రాక్టు లెక్చరర్లు లేనిచోట గెస్ట్‌ ఫ్యాకల్టీని నియమిస్తారు. వాస్తవానికి కాలేజీల్లో ప్రవేశాలు జూలై చివరి వరకు జరుగుతాయి. తర్వాత ఎన్‌రోల్‌మెంట్‌ ఆధారంగా ఆగస్టులో ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్‌ గెస్ట్‌ ఫ్యాకల్టీ అవసరాన్ని గుర్తించి పోస్టును నోటిఫై చేసి జిల్లా ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ (డీఐఈవో)  దృష్టికి తీసుకెళతారు. 

అనంతరం పత్రికా ప్రకటన జారీచేసి.. వచ్చిన దరఖా­స్తుల్లో అర్హతల ఆధారంగా నిపుణుల కమిటీ (మూడు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్ల) ద్వారా అభ్యరి్థని సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ ఎంపిక చేసి వివరాలను డీఐఈవోకి పంపిస్తారు. ఇదే విషయాన్ని డీఐఈవో ద్వారా ఆర్జేడీకి తెలియజేస్తారు. అంతేగాని గెస్ట్‌ ఫ్యాకల్టీని నేరుగా నియమించే అధికారం ఆర్జేడీలకు లేదు. కానీ.. ఆ శాఖలోని ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో నిబంధనల్ని తోసిరాజని ఆగస్టులో నోటిఫికేషన్‌ ద్వారా జరగాల్సిన గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకం జూన్‌ నెలలోనే పూర్తి చేశారు.

గెస్ట్‌ ఫ్యాకల్టీగా నియమితులైన వారు నెలకు 72 పీరియడ్లు మించి బోధించడానికి అవకాశం లేదు. గతంలో పీరియడ్‌కు రూ.150 చొప్పున ఇవ్వగా.. గతేడాది రూ.350కి పెంచడంతో (నెలకు రూ.27 వేలు) ఈ పోస్టులకు డిమాండ్‌ పెరిగింది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆర్జేడీలు పోస్టుకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు రేటు కట్టి మరీ అమ్మేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement