
న్యాయం కోసం పోలీస్స్టేషన్కు వచ్చిన గిరిజన మహిళకు ఎస్ఐ బెదిరింపులు
కోరిక తీర్చాలంటూ వేధింపులు
రాత్రిళ్లు నగ్నంగా వీడియో కాల్స్
సాక్షి టాస్క్ఫోర్స్: న్యాయం కోసం పోలీస్స్టేషన్ మెట్లెక్కిన ఓ గిరిజన మహిళను ఆ స్టేషన్ ఎస్ఐ లైంగికంగా వేధించాడు. తన కోరిక తీరిస్తే.. కేసులో న్యాయం చేస్తానని, లేదంటే ఇబ్బందులు తప్పవంటూ బెదిరించాడు. రాత్రి వేళల్లో పదే పదే వీడియో కాల్స్ చేసి వేధించేవాడు. దీంతో బాధిత మహిళ తన భర్తకు విషయం చెప్పగా.. ఆయన కూడా ఎస్ఐని బతిమాలినా ఆ ఎస్ఐ వెనక్కు తగ్గలేదు. ఆమె కదలికలపై నిఘా పెట్టి ఆమెను వెంబడించి వేధించేవాడు. మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం పట్నం పోలీస్స్టేషన్ ఎస్ఐ రాజశేఖర్ వేధింపులతో ఆ యువతి తీవ్ర మానసిక వేదన అనుభవిస్తోంది.
వెంబడించి మరీ వేధింపులు
గరుగుతండాకు చెందిన భార్యాభర్తల విడాకుల కేసులో భాగంగా ఆ భార్యకు రావాల్సిన భరణం గురించి మాట్లాడేందుకు ఇటీవల పట్నం పోలీస్స్టేషన్కు ఆమె బంధువులు వెళ్లారు. ఆ మహిళకు న్యాయం చేయాలంటూ బంధువులతో కలిసి వెళ్లిన పాపానికి ఎస్ఐ తనను లైంగికంగా వేధిస్తున్నారని బాధిత మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ఎస్ఐ తనకు నగ్నంగా చేసిన వీడియో కాల్స్ను రికార్డ్ చేసినట్టుగా ఆమె చెప్పింది. ఇటీవల తాను వ్యక్తిగత పని మీద అనంతపురం వెళ్తే.. ఎస్ఐ రాజశేఖర్ తనను వెంబడించి తన వద్దకు వచ్చి వాహనంలోకి ఎక్కాలంటూ బలవంతపెట్టాడని కన్నీటిపర్యంతమైంది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన అధికారే తమను ఇలా వేధిస్తుంటే.. ఇక తాము ఎవరికి చెప్పుకోవాలంటూ బాధిత మహిళతో పాటు, ఆమె బంధువులు ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతు
న్నారు. కాగా, ఎస్ఐ రాజశేఖర్ ప్రవర్తనపై ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.