కరోనా సమయంలో తాత్కాలికంగా కోర్సును నిలుపుదల చేసిన ఎన్సీటీఈ
అప్పటి వర్సిటీ అధికారులు సమగ్ర వివరాలు సమర్పించడంతో సంతృప్తి
దీంతో మళ్లీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసిన అప్పటి వర్సిటీ యంత్రాంగం
బాబు ప్రభుత్వం ఏర్పాటుతో పక్కదారి పట్టిన పునఃగుర్తింపు ప్రక్రియ
సాక్షి, అమరావతి: ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) అసమర్థ పాలనలో కునారిల్లుతోంది. చంద్రబాబు ప్రభుత్వ స్వార్థ, కుటుంబ రాజకీయ ప్రయోజనాల కోసం ఉనికి, ప్రగతిని కోల్పోతోంది. దూరవిద్య బీఈడీ కోర్సులకు శాశ్వతంగా స్వస్తి పలికేందుకు సర్కారు పథక రచన చేస్తోంది.
ఉపాధ్యాయులకు తీరని అన్యాయం
కరోనా సమయంలో బీఈడీ స్టడీ మెటీరియల్కు యూజీసీ–డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో (డెబ్) అనుమతి, ఇతర పరిశీలన కోసం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ఏయూలో దూరవిద్య బీఈడీ అనుమతులను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. దీనిపై అప్పటి వర్సిటీ అధికారులు డెబ్కు లేఖరాశారు. అటువంటి సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్కు తన అనుమతి అవసరం లేదని డెబ్ తేల్చిచెప్పింది. ఇదే విషయాన్ని అప్పటి అధికారులు ఎన్సీటీఈ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 2023 డిసెంబర్లో వర్సిటీ అధికారులు సమర్పించిన వివరాలతో ఎన్సీటీఈ సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పునఃగుర్తింపు కోసం వర్సిటీ అధికారులు ఎన్సీటీఈకి దరఖాస్తు పెట్టారు. ఇంతలో ఎన్నికల కోడ్, ఆ తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అనుమతుల ప్రక్రియను గాలికొదిలేసింది.
‘థర్డ్ మెథడాలజీ’పై అనిశ్చితి
ఉపాధ్యాయులు తమ రంగంలో సబ్జెక్టు పెంచుకునేందుకు, ప్రమోషన్ల కోసం థర్డ్ మెథడాలజీని అభ్యసిస్తున్నారు. దీనిని దూరవిద్యలోనే పూర్తి చేసే వెసులుబాటు ఉంటుంది. అలాంటిది కొన్నేళ్లుగా ఏయూలో థర్డ్ మెథడాలజీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడలేదు. బీఈడీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు థర్డ్ మెథడాలజీకి నోటిఫికేషన్ ఇవ్వొచ్చనే ఆలోచనతో నిలిపివేశారు. తీరా బీఈడీ కోర్సు పరిస్థితి అగమ్యగోచరం కావడంతో.. థర్డ్ మెథడాలజీ విషయంలోనూ అనిశ్చితి ఏర్పడింది.
వాళ్లకు ఇచ్చిన అనుమతి.. ఇక్కడెందుకు రావట్లేదు?
⇒ తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీ ఈ ఏడాది సెపె్టంబర్లో ఎన్సీటీఈ నుంచి 500 బీఈడీ సీట్లతో కోర్సుకు అనుమతి తెచ్చుకుంది.
⇒ మైసూర్లోని కర్ణాటక స్టేట్ ఓపెన్ వర్సిటీ సైతం ఎన్సీటీఈ నుంచి బీఈడీ కోర్సుల నిర్వహణకు అనుమతి పొందింది.
⇒ ఇక వైస్ చాన్సలర్ సహా ఇప్పటివరకు ఏయూ నుంచి ఒక్క అధికారి కూడా ఎన్సీటీఈని సంప్రదించి బీఈడీ కోర్సు పునః గుర్తింపు కోసం అడిగిన పాపాన పోలేదు.
⇒ కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది.
రెండేళ్లలో రూ.3.50 కోట్లు నష్టం
ఏయూలో 500 బీఈడీ సీట్ల భర్తీకి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో దాదాపు 5–6వేల మంది ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు పోటీపడతారు. రెండేళ్ల కోర్సుకు రూ.35 వేల చొప్పున ఫీజు నిర్ణయించింది. అంటే ఏడాదికి రూ.1.75 కోట్లు ఆదాయం దూరవిద్య సంస్థ ద్వారా ఏయూకు వచ్చేది. రెండేళ్లలో వర్సిటీకి రూ.3.50కోట్లకుపైగా నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.
బాబు బంధుప్రీతే కారణం
చంద్రబాబు బంధుప్రీతి ఏయూను నిర్వీర్యం చేస్తోంది. విశాఖలోని తమ కుటుంబానికి చెందిన వ్యక్తుల కార్పొరేట్ విద్యా సంస్థకు మేలు చేసేందుకు ఏకంగా శతాబ్దాలు చరిత్ర కలిగిన ఏయూను దెబ్బతీసేందుకు వెనుకాడట్లేదు. ముందుగా దూరవిద్య నుంచి డ్యామేజ్ మొదలెట్టారు. అందులో భాగంగానే బీఈడీ కోర్సుల అనుమతి పునరుద్ధరణను కావాలనే పట్టించుకోవట్లేదని వర్సిటీ వర్గాలే విమర్శిస్తున్నాయి. త్వరలో అస్మదీయ కార్పొరేట్ విద్యా సంస్థ దూరవిద్యలోకి బీఈడీ కోర్సు వచ్చి చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.


