రికవరీలోనూ ఏపీ నంబర్వన్
94.52 శాతంతో దూసుకుపోతున్న రాష్ట్రం
సాక్షి, అమరావతి: కరోనా రికవరీలోనూ ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకుపోతోంది. కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరగడంతో ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జనాభాతో పాటు, మౌలిక వసతుల్లో ముందున్న పెద్ద రాష్ట్రాలే పరీక్షలు, రికవరీల్లో మనకంటే వెనక ఉన్నాయి. మిలియన్ జనాభాకు అత్యధిక పరీక్షలు చేస్తూ ఏపీ మొదటి స్థానంలో కొనసాగుతోంది. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 94.52 శాతం రికవరీ రేటు నమోదైంది. ఇది దేశంలోనే అత్యధికం. దేశ సగటు రికవరీ రేటు 87.78గా నమోదైంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా రికవరీలో ఏపీ కంటే వెనుకబడి ఉన్నాయి.
పరీక్షల్లో అదే హవా : రాష్ట్రంలో మొత్తం 14 వైరాలజీ ల్యాబొరేటరీలు, ట్రూనాట్ మెషీన్లతో పాటు యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మిలియన్ జనాభాకు 1,32,326 మందికి టెస్టులు చేస్తున్నారు. 1,23,111 మందికి పరీక్షలు చేస్తూ అసోం రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. మరణాల నియంత్రణలోనూ ఏపీ గణనీయ వృద్ధి సాధించింది. గతంలో రోజుకు 90 మరణాలుండగా, ఇప్పుడా సంఖ్య 25కు తగ్గింది. ఈ సంఖ్యను మరింత తగ్గించే వ్యూహంతో ప్రభుత్వం ముందుకుసాగుతోంది.