సీఎం సానుకూలంగా స్పందించారు

AP NGO representatives met CM YS Jagan - Sakshi

సీఎం జగన్‌ను కలిసిన ఏపీ ఎన్జీవో సంఘం ప్రతినిధులు  

సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను వివరించినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమకు రావాల్సిన బకాయిలు, రాయితీలు, ఎదుర్కొంటున్న సమస్యలను వివరించామని చెప్పారు.

కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఉద్యోగులకు నిలిపివేసిన 50 శాతం జీతాలను, మార్చి నెలలో నిలిపివేసిన పెన్షన్‌దారుల సగం పెన్షన్‌ వెంటనే చెల్లించాలని కోరామన్నారు. జూలై 1, 2018, జనవరి 1, 2019, జూలై 1, 2019 నుంచి బకాయి ఉన్న మూడు విడతల డీఏలను విడుదల చేయాలని అడిగామన్నారు. జూలై 1, 2018 నుంచి 55% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చినట్టు చెప్పారు. సీఎంను కలిసిన వారిలో సంఘ ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, రాష్ట్ర సహాధ్యక్షుడు సీహెచ్‌ పురుషోత్తమనాయుడు, ఉపాధ్యక్షుడు డీవీ రమణ ఉన్నారని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top