AP Employees Union Leaders Praises On CM YS Jagan Over PRC, Retirement Age Announcement - Sakshi
Sakshi News home page

ఉద్యోగుల పక్షపాతి సీఎం జగన్‌

Jan 7 2022 5:19 PM | Updated on Jan 8 2022 8:25 AM

AP Employees Union Leaders Comments After CM Jagan PRC Declaration - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్‌ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం సంతోషకరమైన నిర్ణయమని ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. తాము అనుకున్న దానికంటే ఎక్కువే చేసినందున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జనవరి జీతం నుంచే పెంచిన పీఆర్సీ, ఐదు డీఏలు ఇస్తామడం మంచి బెనిఫిట్‌ అనిపేర్కొన్నారు.

ఉద్యోగుల పక్షపాతి సీఎం జగన్‌ 
ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై సీఎం వైఎస్‌ జగన్డ్‌ తీసుకున్న నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌ ఉద్యోగుల పక్షపాతి అని నిరూపించుకున్నారు. రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లకు పెంచడం సంతోషకరమైన నిర్ణయం. ఈ జనవరి జీతం నుంచే పెంచిన పీఆర్సీ, 5డీఏలు ఇస్తామనడం మంచి బెనిఫిట్‌. ఏప్రిల్‌లోపు పెండింగ్‌ బిల్లులన్నీ క్లియర్‌ చేస్తామని చెప్పడం మంచి పరిణామం.    – కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు  

ఎవరూ ఊహించని వరాలు   
ఎవరూ ఊహించని విధంగా సీఎం.. మాకు వరాలిచ్చారు. సీఎస్‌ కమిటీ సిఫారసు చేసినట్లు 14.29 ఫిట్‌మెంట్‌ను పక్కన పెట్టి 23 శాతం ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను జూన్‌ 30లోపు కొత్త ఫిట్‌మెంట్‌ సహా క్రమబద్దీకరిస్తామని స్పష్టంగా చెప్పారు. ఇళ్లు లేని వారికి 20 శాతం రిబేటుతో స్థలాలు కేటాయిస్తామనడం అభినందనీయం. మేం ప్రభుత్వానికి 71 డిమాండ్లు ఇవ్వగా 50 డిమాండ్లకు పరిష్కారం దొరికింది.     – బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ చైర్మన్‌ 

సాహసోపేత నిర్ణయాలు 
సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్‌ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన జీతాలివ్వాలని ప్రతిపాదించినప్పటికీ, ఉద్యోగుల ఆకాంక్షల మేరకు 10 నెలల ముందే ఇవ్వాలని సీఎం ఆదేశించటం అభినందనీయం. రిటైర్మెంట్‌ వయసును 62 ఏళ్లకు పెంచడంపై మేం ఆశ్చర్యానికి గురయ్యాం. ఇది నిజంగా సాహసోపేత నిర్ణయం. మెజారిటీ బెనిఫిట్స్‌ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాం.  – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఎసీ అమరావతి చైర్మన్‌  

అన్నీ ఉద్యోగ సంఘాలు హర్షిస్తున్నాయి  
ఎక్కడా లేని విధంగా పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం పట్ల అన్ని ఉద్యోగ సంఘాలు హర్షించాయి. రెండు వారాల్లో హెల్త్‌ కార్డుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. ఇళ్లు లేని ఉద్యోగులకు ఎంఐజీ లే అవుట్‌ లో 20 శాతం రిబేటు ఇచ్చి స్థలం కేటాయిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను ఈ నెల వేతనంతో ఇవ్వనున్నారు. మొత్తంగా సీఎం నిర్ణయాల పట్ల ఉద్యోగులందరిలో ఆనందం వెల్లివిరుస్తోంది.  – ఎన్‌.చంద్రశేఖరరెడ్డి, ప్రభుత్వ సలహాదారు 

జగన్‌ అంటే ఒక నమ్మకం 
ఊహించని విధంగా ఉద్యోగులకు సీఎం వరాలు ఇచ్చారు. చేస్తానని చెప్పటం వేరు.. చేయడం వేరు. సీఎం జగన్‌ చేసి చూపించారు. అది ఒక్క సీఎం జగన్‌కే సాధ్యం. సీఎం జగన్‌ అంటే ఒక నమ్మకం. ఇది ఉద్యోగులకు సీఎం జగన్‌ ఇచ్చిన సంక్రాంతి కానుక. పెండింగ్‌ డీఏలన్నీ ఒకేసారి చెల్లిస్తామనడం రాష్ట్రంలో ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రంలోని ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారు.     – వైవీరావు, ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేత  

మాకు శుభవార్త 
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మూడు నెలలుగా పడుతోన్న ఆందోళనకు తెరపడింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులు పర్మినెంట్‌ కావని కొందరు చేసిన దుష్ప్రచారానికి సీఎం అడ్డుకట్ట వేశారు.   ఉద్యోగులకు మేలు చేసే విషయంలో మనసుతో, గుండెతో స్పందించి సీఎం జగన్‌ ఈ నిర్ణయాలను ప్రకటించినట్లు అర్థమైంది. ప్రభుత్వం మంచి పాలన అందించడంలో ఉద్యోగుల సహాయ, సహకారాలు మరింతగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయని చెబుతున్నాం. ఉద్యోగుల ఆశీస్సులు, చల్లని దీవెనలు సీఎం జగన్‌కు ఎల్లవేళలా ఉంటాయి.   – మహ్మద్‌ జానీ బాషా, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం నేత  

నిజంగా మాకు పండుగే 
సంక్రాంతి ముందు ఇంకో పెద్ద పండుగలా ఉంది. కరోనా ఆర్థిక పరిస్థితుల్లో సైతం 23 శాతానికిపైగా ఫిట్‌మెంట్‌ ప్రకటించడం హర్షించతగ్గ విషయం. పదవీ విరమణ వయస్సు పెంపు హర్షణీయం. – బి.సేవానాయక్, కార్యదర్శి, జేఏసీ ఏపీ నాన్‌ గ్రాడ్యుయేట్‌ వెటర్నేరియన్స్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌  

స్వాగతిస్తున్నాం 
ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఉద్యోగులు ఊహించని విధంగా సర్వీసు కాల పరిమితిని 62 ఏళ్లకు పెంచడం పట్ల కృతజ్ఞతలు. సర్వీసు కాలాన్ని పెంచడంతో పాటు ఇంటి స్థలాల కొనుగోలుపై 20 శాతం రిబేట్‌ ఇవ్వడం, పెండింగ్‌ డీఏల చెల్లింపు, నిర్ణీత సమయంలో కారుణ్య నియామకాలు తదితర నిర్ణయాలు మాకందరికీ సంతృప్తినిచ్చాయి. అర్హత గలవారికి పదోన్నతులు ఇవ్వాలని కోరుతున్నాం. 
– ఎస్‌.కృష్ణమోహన్, ఏపీ మునిసిపల్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు 

సీఎంకు ధన్యవాదాలు 
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏప్రిల్‌ లోపు ఉన్న బకాయిలన్నీ క్లియర్‌ చేయాలని ఆదేశాలు ఇవ్వడం హర్షించతగ్గ విషయం. వైద్యపరంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సీఎస్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం ఆహ్వానిస్తున్నాం. ఉద్యోగులెదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా ఆదేశాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.  – పావులూరి హనుమంతరావు, ఏపీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  

ఆనందంగా ఉంది 
కరోనా పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ 23.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడం హర్షణీయం. ఈ నెల నుంచే డీఏలన్నీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం నిజంగా హర్షించతగ్గ విషయం. ఉద్యోగుల తరఫున సీఎంకు కృతజ్ఞతలు.  – ఏఏ భాస్కరరెడ్డి, అధ్యక్షుడు, ఏఎంసీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం  

ఉద్యోగులకు ఎంతో మేలు 
ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉద్యోగులకు ప్రభుత్వం 23 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. స్మార్ట్‌ సిటీలలో 10 శాతం స్థలాల కేటాయింపుతో పాటు 20 శాతం రాయితీ ఇవ్వడం ఇళ్లు లేని ఉద్యోగులకు ఎంతో మేలు చేసే అంశం. ఈ పీఆర్సీలో ఉద్యోగులు ఊహించని ఎన్నో లాభాలను చేకూర్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు.  – వి.జయదేవ్, టూరిజం కార్పొరేషన్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ 

అనుకున్నదాని కంటే ఎక్కువ 
ఉద్యోగుల పీఆర్సీపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆనందం కలిగిస్తోంది. ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న దానికంటే సీఎం ఎక్కువే చేసినందుకు కృతజ్ఞతలు.   – కళ్లే పల్లి మధుసూదన రాజు, కన్వీనర్‌ కోన దేవదాసు, ఏపీ గ్రంథాలయ ఉద్యోగుల సంఘం (108/19)

ఆర్థిక సమస్యలున్నా ఉద్యోగుల సంక్షేమాన్ని వీడలేదు   
కోవిడ్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సీఎం వైఎస్‌ జగన్‌ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడ్డారు. రాష్ట్ర ఉద్యోగుల కోర్కెలను చాలావరకు తీర్చారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు వచ్చే జూన్‌ నాటికి ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసి రెగ్యులర్‌ పే స్కేల్‌ ఇస్తామని ప్రకటించడం శుభపరిణామం. – వీఎస్‌ దివాకర్, రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్‌  

హర్షణీయం
కోవిడ్‌ సంక్షోభంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా 23 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించడం హర్షణీయం. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారనేందుకు ఇది తార్కాణం. ఇళ్లు లేని ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ ఇళ్లు.. తదితర అంశాలు ఎంతో అభినందనీయం.  – కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ   

ముందుగానే సంక్రాంతి 
అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 27శాతం ఐఆర్‌ ఇచ్చారు. పెండింగ్‌ డీఏలను జనవరి నుంచి ఇస్తామనడం, ఇళ్లు లేని ఉద్యోగులకు రాయితీపై ఎంఐజీలో అవకాశం కల్పించడంతో ఉద్యోగులకు సంక్రాంతి సంబరాలు ముందే వచ్చాయి. సీఎంకు వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ తరఫున కృతజ్ఞతలు   
– కె.జాలిరెడ్డి, కె.ఓబుళపతి వైఎస్సార్‌ టీఎఫ్‌ 

సంతోషకరం  
ఉద్యోగులకు  23% ఫిట్‌మెంట్‌ నిర్ణయం, ఉద్యోగుల పదవీవిరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం హర్షణీయం. ఇళ్లు లేని ఉద్యోగులకు ఇళ్ల నిర్ణయం సంతోషకరం.  
– లెక్కల జమాల్‌రెడ్డి, గురువారెడ్డి.. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం

ఆపద్బాంధవుడు సీఎం 
ఉద్యోగుల పాలిట ఆపద్బాంధవుడుగా సీఎం జగన్‌ మరోసారి నిలిచారు. ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం ఎందరో మధ్యతరగతి ఉద్యోగులకు ఊరటనిచ్చింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సీఎం జగన్‌ 27శాతం ఐఆర్‌ ఇచ్చారు.    
– తూతిక శ్రీనివాసవిశ్వనాథ్, ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, ప్రకాశం 

చదవండి: ఫిట్‌మెంట్‌తో పాటు ఉద్యోగులకు సీఎం జగన్‌ మరో గుడ్‌న్యూస్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement