ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ

AP Cabinet Approved Distribution Of 30 Lakh House Rails - Sakshi

మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చ

28 లక్షల 30వేల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు 28లక్షల 30వేల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్సార్‌ హౌసింగ్ కాలనీల నిర్మాణం, డిసెంబర్ 8న 2.49లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముసాయిదా బిల్లులు, కురుపాం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజీకి 105 ఎకరాల భూ సేకరణ, 2019 ఖరీఫ్‌ ఉచిత పంటల బీమా పథకానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఫిషరీస్‌ యూనివర్శిటీ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వైఎస్‌ఆర్‌ శాశ్వత భూహక్కు, యాజమాన్య సమగ్ర సర్వేకు కేబినెట్‌ ఆమోదించింది. రూ.9,027 కోట్లతో భూముల సమగ్ర సర్వేకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. (చదవండి: సీఎం జగన్‌కు ధన్యవాదాలు: ఎస్పీ చరణ్‌)

కేబినెట్‌ భేటీ అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ నివర్‌ తుపానుపై కేబినెట్‌లో చర్చించామని తెలిపారు. ‘‘30 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. 1300 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి’’ డిసెంబర్‌ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. సుమారు 10వేల మందికిపైగా సహాయక శిబిరాలకు తరలించాం. శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 ఇవ్వాలని సీఎం ఆదేశించారని’’  మంత్రి కన్నబాబు వెల్లడించారు. (చదవండి: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సీఎం జగన్‌ అభినందన)

ఉద్యోగులు, పింఛన్‌దారుల డీఏ బకాయిల్ని చెల్లించాలని నిర్ణయించామని, 3.144 శాతం డీఏ పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయించిందన్నారు.కరోనా సమయంలో జీతాలు, పింఛన్లలో విధించిన కోత డిసెంబర్‌, జనవరి నెలలో చెల్లింపులు చేస్తామని పేర్కొన్నారు.డిసెంబర్ 25న 30లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని, మూడేళ్లలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

డిసెంబర్ 2 నుంచి ఏపీ అమూల్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. తొలిదశలో ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో 9,889 బల్క్‌ చిల్లింగ్‌ అభివృద్ధికి నిర్ణయించామన్నారు. డిసెంబర్‌ 10న గొర్రెలు, మేకల యూనిట్లను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. నాణ్యమైన పశుదాణా ఉత్పత్తి, పంపిణీ బిల్లు తెస్తున్నామని పేర్కొన్నారు. పశువుల దాణాను కల్తీ చేస్తే జరిమానా, జైలుశిక్ష విధించేలా బిల్లును తీసుకువస్తున్నామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top