పాఠశాల విద్యలో ఏపీ ప్రగతి | Andhra Pradesh progress in school education | Sakshi
Sakshi News home page

పాఠశాల విద్యలో ఏపీ ప్రగతి

Jun 7 2021 4:27 AM | Updated on Jun 7 2021 4:27 AM

Andhra Pradesh progress in school education - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాల విద్య గ్రేడింగ్‌ గవర్నెన్స్‌ ప్రాసెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రగతి సాధించింది. 2018–19 కన్నా 20 శాతం మెరుగుపడింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాఠశాల విద్య పనితీరు గ్రేడింగ్‌ ఇండెక్స్‌ (పీజీఐ) 2019–20 నివేదికకు కేంద్ర విద్యాశాఖమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ఆమోదం తెలిపారు. కేంద్ర విద్యాశాఖ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్, లిటరసీ ఈ నివేదికను రూపొందించింది. పాఠశాల విద్యలో పరివర్తన తీసుకురావడానికి కేంద్రం 70 అంశాలతో పనితీరు గ్రేడింగ్‌ సూచీని ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2017–18 సంవత్సరం ఆధారంగా 2018–19లో తొలిసారి పీజీఐ ప్రచురించారు. ఇప్పుడు 2019–20 నివేదికను కేంద్రం ఆమోదించింది. 2018–19తో పోలిస్తే 2019–20లో ఆంధ్రప్రదేశ్‌ సహా 19 రాష్ట్రాలు కనీసం 20 శాతం (72 పాయింట్లు, అంతకంటే ఎక్కువ) మెరుగుదల చూపించాయి. పంజాబ్, చండీగఢ్, తమిళనాడు, అండమాన్‌ నికోబార్‌ దీవులు, కేరళ ఏ++ గ్రేడ్‌ సాధించాయి.


ఆంధ్రప్రదేశ్‌ 72 పాయింట్లకుపైగా, తెలంగాణ 15 పాయింట్లు మెరుగుపరచుకున్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌ 4వ లెవెల్‌ గ్రేడ్‌–1 (801–850 పాయింట్లు), తెలంగాణ 5వ లెవెల్‌ గ్రేడ్‌–2 (751–800 పాయింట్లు) సాధించాయి. కేటగిరీ–1 డొమైన్‌–1లో లెర్నింగ్‌ అవుట్‌కమ్, క్వాలిటీలో 180 పాయింట్లకు ఆంధ్రప్రదేశ్‌ 154, తెలంగాణ 142 పాయింట్లు సాధించాయి. రాజస్థాన్‌ 168 పాయింట్లతో తొలిస్థానంలో ఉంది. కేటగిరీ–1 డొమైన్‌–2లో యాక్సెస్‌ విభాగంలో 80 పాయింట్లకు ఆంధ్రప్రదేశ్‌ 65, తెలంగాణ 69 పాయింట్లు సాధించాయి. కేరళ 79 పాయింట్లతో తొలిస్థానంలో నిలిచింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్‌ విభాగంలో 150 పాయింట్లకు ఆంధ్రప్రదేశ్‌ 117, తెలంగాణ 113 పాయింట్లు సాధించాయి. పంజాబ్‌ 150 పాయింట్లతో తొలిస్థానంలో ఉంది. ఈక్విటీ విభాగంలో 230 పాయింట్లకు ఆంధ్రప్రదేశ్‌ 204, తెలంగాణ 210 పాయింట్లు సాధించాయి. 228 పాయింట్లతో పంజాబ్‌ మొదటి స్థానంలో నిలిచింది. గవర్నెన్స్‌ ప్రాసెస్‌లో 360 పాయింట్లకుగాను ఆంధ్రప్రదేశ్‌కు 271, తెలంగాణకు 238 పాయింట్లు లభించాయి. పంజాబ్‌ 346 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. పీజీఐ ప్రవేశపెట్టిన 2017–18 నుంచి ఇప్పటివరకు ఏ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం కూడా లెవెల్‌ 1 (951–1000 పాయింట్లు) సాధించలేదు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement