పాఠశాల విద్య డైరెక్టరేట్కు ప్రభుత్వం ఆదేశాలు
ఇన్ సర్వీస్ టీచర్లకు న్యాయం చేస్తామని వైఎస్ జగన్ హామీ
వారి సమస్య ఎందుకు పట్టించుకోవడంలేదని చంద్రబాబుని ‘ఎక్స్’లో నిలదీసిన జగన్
ఆగమేఘాలపై స్పందించిన ప్రభుత్వం
ప్రత్యేక టెట్కు మెమో జారీ.. అదీ పాత తేదీలతో..
స్పెషల్ టెట్పై జీవో కాకుండా మెమో ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు
ఇప్పటికే రెగ్యులర్ టెట్కు 74 వేలకుపైగా ఇన్ సర్వీస్ దరఖాస్తులు
వీరి విషయం ఏం చేస్తారో చెప్పని ప్రభుత్వం
సర్కారు తీరుపై ప్రభుత్వ ఉపాధ్యాయుల విమర్శలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యా శాఖకు బుధవారం మెమో జారీ చేసింది. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై రివ్యూ పిటిషన్ వేయాలని, పార్లమెంటులో చట్టం చేయించాలని కోరుతున్నా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. మంగళవారం ప్రభుత్వ ఉపాధ్యాయులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమకు న్యాయం చేయాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.
టెట్ మినహాయింపునకు కృషి చేస్తానని, పార్లమెంటులో చట్ట సవరణ కోసం పోరాడతామని, ఉపాధ్యాయులు ఆందోళన చెందవద్దని వారికి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అంతేగాక, ఇన్ సర్వీస్ టెట్పై ఉపాధ్యాయుల ఆందోళనను ఎందుకు పట్టించుకోవడంలేదని బుధవారం సీఎం చంద్రబాబునాయుడిని ‘ఎక్స్’ వేదికగా నిలదీశారు. వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేసిన 2 గంటల్లోనే ప్రభుత్వం ప్రత్యేక టెట్కు ఉత్తర్వులివ్వడం గమనార్హం.
టీచర్ల ఘోషను పట్టించుకోని సర్కారు
గత ఏడాది సెప్టెంబర్ 1న సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో 2011 కంటే ముందు డీఎస్సీ ద్వారా ఎంపికైన లక్ష మందికి పైగా ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 20 ఏళ్లకు పైగా బోధన అనుభవంతో పాటు నాటి నిబంధనల ప్రకారం డీఎస్సీ ద్వారా ఉద్యోగాల్లోకి వచ్చిన తమకు ఇప్పుడు టెట్ ఏమిటని ఉపాధ్యాయులంతా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని విజ్ఞప్తి చేశారు. కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, వీరి ఘోషను చంద్రబాబు ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు. ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు ఇన్ సర్వీస్ టెట్పై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి, రద్దుకు కృషి చేస్తామని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించి, ఆ తర్వాత ముఖం చాటేశారు.
ఈ 74 వేల దరఖాస్తుల సంగతేంటి?
మరోపక్క, సుప్రీం కోర్టు తీర్పు, ఉపాధ్యాయుల విజ్ఞప్తులను పెడచెవిన పెట్టి చంద్రబాబు ప్రభుత్వం గతేడాది సెపె్టంబర్లో టెట్కు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి 20 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ–2026 స్కామ్ నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం గత నెల 5న ‘ఏపీ టెట్ జూన్ – 2026’ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు గడువు ఈనెల 5వ తేదీతో ముగిసింది. ఈ పరీక్ష కోసం 2,13,540 దరఖాస్తులు రాగా, వాటిలో 74,295 దరఖాస్తులు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులవి. వీరి నుంచి ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున ఫీజు వసూలు చేశారు. ఇప్పుడు స్పెషల్ టెట్ నిర్వహిస్తే ఈ దరఖాస్తులను ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పడంలేదు.
జీవో ఎందుకు ఇవ్వలేదు?
మరోపక్క స్పెషల్ టెట్ నిర్వహించాలంటే ప్రభుత్వం జీవో విడుదల చేయాలి. ఆ తర్వాతే సిలబస్, పరీక్షా విధానం తదితర అంశాలపై పాఠశాల విద్యా శాఖ మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. కానీ, ఇప్పుడు అందుకు విరుద్ధంగా స్పెషల్ టెట్కు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి ‘మెమో’ ఇవ్వడంపై ఉపాధ్యాయులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పాత తేదీలతో మెమో
బుధవారం విడుదల చేసిన ఈ మెమోను జూన్ 25న సిద్ధం చేసినట్లు, జూలై ఒకటో తేదీ విడుదల చేసినట్లు పాత తేదీలు ఉండటం గమనార్హం. అంతేగాక టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, పేరాబత్తుల రాజశేఖర్ స్పెషల్ టెట్పై జూన్ 1న విజ్ఞప్తి చేశారంటూ పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ఈ ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకే 2025 అక్టోబర్లో 28న ఇన్ సర్వీస్ టెట్పై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి, రద్దుకు కృషి చేస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చి, ఆ తర్వాత ముఖం చాటేశారు.


