జంతు హింస, జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయండి | Andhra Pradesh High Court verdict on petitions filed to stop cockfighting | Sakshi
Sakshi News home page

జంతు హింస, జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయండి

Jan 11 2026 3:45 AM | Updated on Jan 11 2026 3:45 AM

Andhra Pradesh High Court verdict on petitions filed to stop cockfighting

జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు  హైకోర్టు  ఆదేశం

కోడి పందేలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పు

సాక్షి, అమరావతి: సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర­వ్యాప్తంగా ముఖ్యంగా తూ­ర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూ­రు జిల్లాల్లో విస్తృతంగా కోడి పందేలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జంతుహింస నిరోధక చట్టం–1960, ఏ­పీ జూద నిరోధక చట్టం–1974ను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. ఎక్క­డైనా ఉల్లంఘనలు జరిగితే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. చట్టాల అమ­లులో విఫ­లమైతే తహసీల్దార్లు, పోలీసు అ­ధికారులపై క్రమ­శిక్షణ చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఆయా జిల్లాల్లోని మండలాల్లో సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదే­శించింది. కోడి పందేల పేరుతో బెట్టింగ్, ఇతర చట్ట విరుద్ధ కార్యకలా­పాలు నిర్వహిస్తూ యువ­తను వాటిలోకి లాగుతున్నారని, దీంతో వారు ఆస్తులు కోల్పోయే పరిస్థితి వస్తోందంటూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. పందేలను ఆపేలా చర్యలు తీసుకోవాలని వినతి­పత్రాలు ఇచ్చినా పోలీసులు పట్టించుకోవ­డం లేదని పేర్కొన్నారు. గతంలోనూ హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసినా అధికారులు పూర్తి­స్థాయిలో అమలు చేయలేదని తెలిపారు. ఈ వ్యాజ్యా­లపై న్యాయ­మూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు. ఇరు­పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... జంతు హింస నిరోధక చట్టం, ఏపీ జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పారు.

తహసీల్దార్, ఎస్‌ఐలతో తనిఖీ బృందాలు
సంయుక్త తనిఖీ బృందాల్లో తహసీల్దార్, ఎస్‌ఐ ర్యాంకుకు తగ్గని పోలీసు అధికారి, భార­త జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా జంతు సంరక్ష­ణకు పనిచేసే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి స­భ్యులుగా ఉండాలని కలెక్టర్లను హైకోర్టు ఆదేశించింది. వీరు తనిఖీలకు వెళ్లే సమయంలో ఇద్దరు పోలీ­సులు, ఒక ఫోటోగ్రాఫర్‌ సహాయకులుగా ఉండాలని పేర్కొంది. ‘‘కోడి పందేలు ఎక్కడ నిర్వహిస్తు­న్నారు? బరులను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? తదితర వివరాలను తెలుసుకునేందుకు తనిఖీ బృందాలు మండలాల పరిధిలోని గ్రామాలను సందర్శించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేయాలి.

కోడి పందేలకు ప్రయత్నాలు జరు­గుతు­న్నట్లు సమాచారం అందితే కలెక్టర్లు, పోలీసు కమి­షనర్లు, ఎస్పీలు తక్షణమే చర్యలు చేపట్టాలి. అవ­సరమైతే 144 సెక్షన్‌ కింద ఉన్న అధికారాలను సైతం ఉపయోగించుకోవచ్చు. కోడి పందేల్లో ఉపయోగించిన, ఉప­యోగించ తలపెట్టిన ఉపకరణాలు, పందేల సందర్భంగా వసూలు చేసిన డబ్బును జప్తు చేయ­వచ్చు’’ అని డాక్టర్‌ జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతా­ప తీర్పుని­చ్చారు. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యా­య­వాది (హోం) అడుసుమిల్లి జయంతి వాద­న­లు విని­పిస్తూ చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొ­నకుండా పోలీసులు ప్రజలను చైతన్యపరుస్తున్నారని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement