ఆ ‘వెలుగు’ దేశానికే ఆదర్శం

Andhra Pradesh Govt ideal state for country in renewable energy - Sakshi

పునరుత్పాదక విద్యుత్‌లో దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం 

వ్యవసాయానికి సౌర విద్యుత్‌ను వినియోగించాలని గతంలోనే ఏపీ నిర్ణయం  

ఇదే ఫార్ములా అమలుపై అన్ని రాష్ట్రాలకూ కేంద్రం దిశా నిర్దేశం 

సాక్షి, అమరావతి: రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అంతర్జాతీయంగా కర్బన ఉద్గారాలపై జరుగుతున్న యుద్ధంలో తొలి అడుగు వేసిన ఏపీ సంస్కరణలు.. దేశంలోని మిగతా రాష్ట్రాల్లోనూ అమలయ్యే దిశగా సాగుతున్నాయి. తాజాగా కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ఇంధన శాఖ కార్యదర్శులతో జరిపిన సమావేశంలో ఏపీ తర హా చర్యలను అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని సూచించింది.

దేశంలో పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా మారుతున్న వాతావరణ పరిస్థితులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుండటంతో దానిపై కేంద్రం దృష్టి సారించింది. విద్యుదుత్పత్తి రంగంలో మార్పులకు శ్రీకారం చుడుతూ.. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిని తగ్గించి, సౌర, పవన విద్యుదుత్పత్తిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీని కోసం లక్ష్యాలనూ నిర్దేశించుకుంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని భావిస్తోంది. 2070 నాటికి దేశంలో కాలుష్యం అనేది జీరో స్థాయికి తీసుకురావాలన్నది అంతిమ లక్ష్యం. ఈ మేరకు రాష్ట్రాల మద్దతును కోరుతోంది. అయితే కొన్ని రాష్ట్రాలే ఈ ప్రయత్నం లో ఉత్సాహంగా భాగమవుతున్నాయి. వాటిలో మన రాష్ట్రం ముందుందని కేంద్రం ప్రశంసించింది.

పర్యావరణ పరిరక్షణలో ఏపీ ముందడుగు.. 
రాష్ట్రం ప్రభుత్వం వ్యవసాయానికి సౌర విద్యుత్‌ను వినియోగించాలని నిర్ణయించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(సెకీ) నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తీసుకుని వ్యవసాయానికి ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సెకీతో ఒప్పందానికి కేబినె7ట్‌ ఆమోదం కూడా తెలిపింది. అంతేకాకుండా రైతులకు అందించే ఉచిత విద్యుత్‌ కోసం ప్రత్యేక విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఇప్పుడు ఇదే ప్రక్రియను మిగిలిన రాష్ట్రాలూ అనుసరించాలని కేంద్రం చెబుతోంది. 2024 నాటికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాలకు పునరుత్పాదక విద్యుత్‌నే వినియోగించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది. దీని కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంది. మరోవైపు గృహ నిర్మాణంలోనూ ఇంధన పొదుపు చర్యలను చేపట్టాలని కూడా కేంద్రం చెప్పింది. దీనినీ  ఏపీ ఇప్పటికే అమలు చేస్తోంది. జగనన్న కాలనీల్లో ఇంధన సామర్థ్యం గల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ తరహా ఇళ్ల నిర్మాణం ద్వారా విద్యుత్‌ను పొదుపు చేయడంతో పాటు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చవచ్చు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top