‘స్వేచ్ఛ’గా చదువుదాం | Andhra Pradesh Government measures for the health care of women and girls | Sakshi
Sakshi News home page

‘స్వేచ్ఛ’గా చదువుదాం

Oct 5 2021 3:11 AM | Updated on Oct 5 2021 7:43 AM

Andhra Pradesh Government measures for the health care of women and girls - Sakshi

సాక్షి, అమరావతి: మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రూపొందించిన ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్‌ కళాశాలల్లో 7 నుంచి 12వ తరగతి చదువుతున్న సుమారు 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా న్యాప్‌కిన్స్‌ పంపిణీ చేయనున్నారు. నెలకు పది చొప్పున వీటిని అందచేస్తారు. విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు చదువులకు దూరం కాకుండా చూడటమే లక్ష్యంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వైఎస్సార్‌ చేయూత స్టోర్లలో నాణ్యమైన న్యాప్‌కిన్స్‌ తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు చేపట్టింది.

అపోహలు తొలగిస్తూ..
నాలుగో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2015–16) ప్రకారం రాష్ట్రంలో శానిటరీ న్యాప్‌కిన్స్‌ వినియోగిస్తున్న 15 – 24 వయసు యువతుల శాతం 56 కాగా 2019 – 20 సర్వే నాటికి ఇది 69 శాతానికి పెరిగింది. వాటర్‌ సప్లయి, శానిటేషన్‌ కొలాబరేటివ్‌ కౌన్సిల్‌ లెక్కల ప్రకారం దేశంలో 23 శాతం మంది బాలికలు చదువులు మధ్యలో నిలిపివేయటానికి ప్రధాన కారణం– శానిటరీ న్యాప్‌కిన్స్‌ అందుబాటులో లేకపోవడం, విద్యాసంస్థల్లో కనీస వసతులు కరువవడం, టాయిలెట్లలో రన్నింగ్‌ వాటర్‌ లేకపోవడమేనని వెల్లడైంది.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలను మహిళా, శిశు సంక్షేమశాఖ పరిధిలోకి తెచ్చింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి స్కూళ్లు, కాలేజీలలో న్యాప్‌కిన్స్‌ పంపిణీకి చర్యలు చేపట్టింది. యూనిసెఫ్, వాష్, పీ అండ్‌ జీ తదితర సంస్థలతో కలసి అవగాహన తరగతులు నిర్వహించి రుతుక్రమంపై అపోహలు తొలగించనున్నారు.   

చదవండి: సీఎం జగన్‌కు ప్రజలు అండగా ఉన్నారని నిరూపించాలి

Advertisement
 
Advertisement
Advertisement