సాక్షి,విజయవాడ: రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన అధికారి, ఏజీఐసీఎల్ (AGICL) మేనేజింగ్ డైరెక్టర్ ఎస్వీ రత్న శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబు పాలనపై, ప్రభుత్వ తీరుపై అసంతృప్తితోనే ఈ అధికారి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ముంబై మెట్రో, ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టుల్లో అపార అనుభవం ఉన్న మాజీ ఐఏఎస్ రత్న శ్రీనివాస్ను అమరావతి పనుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ ‘ఏజీఐసీఎల్’ కు ప్రభుత్వం ఎండీగా నియమించింది.
అయితే నియమించిన కొద్ది నెలలకే ప్రభుత్వం తీరుపై ఆయనకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లకే ఆయన విసిగిపోయి వెళ్లిపోయినట్లు సమాచారం. ప్రభుత్వం తీరుపై గతంలోనే అసంతృప్తితో ఈ ఎండీ సెలవు పెట్టారు. అయితే సెలవుపై వెళ్లిన వ్యక్తిని చంద్రబాబు స్వయంగా బుజ్జగించి మళ్లీ రప్పించారు. కానీ మళ్లీ కొద్ది నెలలకే ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు.
ప్రస్తుతం ఏజీఐసీఎల్ ఎండీకి, ఎంఏయూడీ శాఖకు మధ్య ఉన్న విభేదాలే ఈ తీవ్ర నిర్ణయానికి కారణమంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమరావతి నిర్మాణాలపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, రత్న శ్రీనివాస్ వంటి కీలక అధికారి రాజీనామా చేయడం ప్రభుత్వంలో తీవ్ర కలవరం రేపుతోంది. ఏజీఐసీఎల్ ఎండీ రాజీనామాతో అసలు అమరావతిలో ఏం జరుగుతోందంటూ ఇప్పుడు సర్వత్రా చర్చ మొదలైంది.


