
రైతులకు ఉపయోగపడని పరికరాలు
‘వ్యవసాయ యాంత్రీకరణ’ పరికరాల పంపిణీ లక్ష్యం 42,864
సగం ఇచ్చి నిలిపివేసిన కూటమి ప్రభుత్వం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రారంభించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఘోరంగా విఫలమైంది. అవసరం లేని పరికరాలను బలవంతంగా అంటగట్టాలని చూడటంతో ఈ పథకం కింద పరికరాలు తీసుకునేందుకు రైతులు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. పైగా ఆ పరికరాలకు ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే బహిరంగ మార్కెట్లో ధరలు తక్కువగా ఉండడం, జీఎస్టీతో పాటు రవాణా భారంగా మారడం, రాయితీ తక్కువగా ఉండటం వంటి కారణాలతో రైతులు ముందుకు రాలేదు. దీంతో అర్ధాంతరంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని నిలిపి వేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
అంతన్నారు.. ఇంతన్నారు
కూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఏర్పాటైన యంత్ర సేవా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. వ్యక్తిగత యాంత్రీకరణ పథకం అమలు చేయబోతున్నామని గొప్పగా ప్రకటించారు. కేంద్ర పథకమైన స్మామ్ (సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్) ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరానికి 50 శాతం సబ్సిడీపై 42,864 పరికరాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.75.80 కోట్లు కేటాయించింది.
మార్కెట్ ధరలకు మించి ఉండటంతో..
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు కమిటీలు తాము కోరుకున్న పరికరాన్ని కోరుకున్న కంపెనీ వద్ద కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉండేది. పైగా బేరమాడుకుని తక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేకుండా ప్రభుత్వమే ధరలు నిర్దేశించింది. ఈ ధరలకు అదనంగా ప్రతి పరికరంపై 12% నుంచి 18% జీఎస్టీతో పాటు.. 2% ఆగ్రోస్ సేవా చార్జీలు చెల్లించాలని నిర్దేశించారు. అంటే దాదాపు పరికరంపై ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే 14% నుంచి 20% వరకు అదనపు భారం పడుతోంది.
అంటే ఓ పరికరం ధర రూ.25 వేలు అయితే.. కనీస జీఎస్టీ, ఆగ్రోస్ రుసుం కలిపి 14% చొప్పున లెక్కేసినా రూ.3,500, అదే రూ.లక్ష విలువైన పరికరమైతే రూ.1.14 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదే రైతు నేరుగా కొనుక్కుంటే డీలర్ల వద్ద బేరమాడుకుంటే తక్కువ ధరకే లభిస్తుంది. తైవాన్ స్ప్రేయర్ బహిరంగ మార్కెట్లో రూ.18 వేల నుంచి రూ.20 వేలకు లభిస్తుండగా, యాంత్రీకరణ పథకంలో రూ.26 వేలుగా నిర్ణయించి, అందులో రూ.10 వేల రాయితీ ప్రకటించారు.
దీనిపై జీఎస్టీ, వ్యవసాయ ఆగ్రోస్ సేవా చార్జీలు అదనం. ట్రాక్టర్ ఆధారిత యంత్ర పరికరాలు కూడా రైతులు సొంతంగా కొనుక్కుంటేనే తక్కువకు వస్తున్నాయి. పైగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు కూడా రైతులకు ప్రతిబంధకంగా మారాయి.కవీుషన్లకు కక్కుర్తిపడి రైతులకు అవసరం లేని, డిమాండ్ లేని, పనికి రాని పరికరాలను అంటగట్టాలని చూడటంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
సాధారణంగా వ్యక్తిగత పరికరాలు సబ్సిడీపై ఇస్తామంటే రైతులెవరైనా ఎగబడతారు. అలాంటిది రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం అమలు చేసిన ఈ యాంత్రీకరణ పథకం ఏడాదిలోనే అట్టర్ఫ్లాప్ అయ్యింది. ఇందుకోసం కేటాయించిన మొత్తంలో చాలావరకు కమీషన్ల రూపంలో పక్కదారి పట్టినట్టు విమర్శలు వచ్చాయి. దీంతో పథకాన్ని 2024–25 ఏడాదికి అర్థంతరంగా నిలిపివేశారు.