Sakshi News home page

పోలీసులే ఫస్ట్‌ టార్గెట్‌!

Published Wed, Aug 9 2023 4:37 AM

72 people remanded in activist attack incident - Sakshi

సాక్షి, అమరావతి/ చిత్తూరు రూరల్‌/ నెట్‌వర్క్‌:‘చంద్రబాబు పర్యటన సజావుగా సాగేలా బందోబస్తు విధులు నిర్వహించడానికి మేం వచ్చాం. మా అధికారులు, సహోద్యోగులం అంతా బందోబస్తు విధుల్లో ఉన్నాం. ఇంతలో దూరం నుంచే టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మావైపు దూసుకువచ్చారు. అసలు వాళ్లు ఎందుకు అంత ఆగ్రహంతో వస్తున్నారో.. ఏం చేయడానికి వస్తున్నారో కూడా మాకు ఎవరికీ అర్థం కాలేదు. ఏమిటి విషయం అని మేము ఆలోచించే లోగానే వాళ్లు రాళ్లతో మాపై దాడులు చేయడం మొదలు పెట్టారు. పెద్ద పెద్ద రాళ్లు, కర్రలు, పదునైన వస్తువులు పోలీసులపై విసరడం మొదలు పెట్టడంతో అంతా గందరగోళంగా తయారైంది.

నా ముందు ఉన్న డీఎస్పీ తలకు ఓ రాయి వచ్చి తగలడంతో రక్తం బొటబొటా కారింది. మా ఎస్‌.ఐ మేడంపై రాళ్లు, కర్రలు విసరడంతో ఆమె గాయపడ్డారు. ఇంతలోనే నా తల వెనుక భాగాన ఓ రాయి గట్టిగా తగిలింది. కానీ నేను హెల్మెట్‌ ధరించి ఉండటంతో ఏమీ కాలేదు. తలతిప్పి వెనక్కు చూశాను. నా హెల్మెట్‌ గ్రిల్స్‌ మధ్య ఉన్న ఖాళీ నుంచి ఒక రాయి దూసుకొచ్చి బలంగా కంటిపై తగిలింది. దాంతో అమ్మా అని గట్టిగా అరచి నేను కుప్పకూలి­పోయాను. రాళ్ల దెబ్బలతో నా ముఖం మొత్తం రక్తసిక్తం అయ్యింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. మా వాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత పరీక్షించిన వైద్యులు ఒక కంటికి చూపు పోయిందని చెప్పారు.

మరో కంటి చూపు కూడా కోల్పోవచ్చని డాక్టర్లు అంటున్నారు’ అని కానిస్టేబుల్‌ రణధీర్‌ ఆవేదనగా చెప్పుకొచ్చారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా శుక్రవారం టీడీపీ కుట్ర పూరితంగా ముందస్తు పన్నాగంతో పోలీసులపై జరిపిన దాడికి ప్రత్యక్ష సాక్షి అయిన రణధీర్‌ ఆ సంఘటనను కళ్లకు కట్టినట్టుగా చిత్తూరులో మంగళవారం మీడియాకు వివరించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు టీడీపీ నేతలు ఎంత కుట్రపూరితంగా వ్యవహరించారన్నది ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. 

ఇది ముందస్తు కుట్రే..
రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలో ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో టీడీపీ ఆందోళనలో కూరుకుపోయింది. దాంతో ఆయన పర్యటనలకు లేని ఇమేజ్‌ తీసుకు వచ్చేందుకు అల్లర్ల కుట్రకు పథక రచన చేసింది. ఇందులో భాగంగా పుంగనూరు వద్ద భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా రౌడీ మూకలను ముందుగానే తెప్పించారు. పుంగనూరు బైపాస్‌ నుంచి వెళ్లేందుకు ముందుగా టీడీపీ నేతలు అనుమతి కోరితే పోలీసులు సమ్మతించారు. అందుకే బైపాస్‌ రోడ్డులో తగిన పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కానీ పోలీసుల అనుమతికి విరుద్ధంగా పుంగనూరు పట్టణంలోకి చంద్రబాబు ప్రవేశించేటట్టుగా చేయాలని టీడీపీ నేతలు భావించారు. అలా పుంగనూరు పట్టణంలో పర్యటన సందర్భంగా భారీ ఎత్తున అల్లర్లు సృష్టించాలన్నది వారి పన్నాగం.

ముందస్తు అనుమతికి విరుద్ధంగా పుంగనూరు పట్టణంలోకి చంద్రబాబు పర్యటనను పోలీసులు అనుమతించకపోతే బైపాస్‌ రోడ్డు వద్దే విధ్వంసకాండ సృష్టించాలని కూడా ప్లాన్‌ బి రెడీ చేసుకున్నారు. అందుకోసమే భారీ సంఖ్యలో అల్లరి మూకలను బైపాస్‌ రోడ్డు వద్ద ముందుగానే మోహరించారు. కాగా చంద్రబాబు కాన్వాయ్‌ ఇక పుంగనూరు బైపాస్‌కు సమీపిస్తుందనగానే టీడీపీ రౌడీలు రంగంలోకి దిగారు. బందోబస్తు విధుల కోసం అక్కడ ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందిపై హఠాత్తుగా రాళ్లతో దాడి చేశారు. సాధారణంగా పోలీసులు అనుమతి లేకుండా మోహరించిన వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో కొంత వాగ్వాదం, తోపులాటల అనంతరం పరిస్థితి అదుపు తప్పితే కొందరు పోలీసులకు ఎదురుదిరిగే అవకాశం ఉంటుంది.

కానీ పుంగనూరులో అందుకు విరుద్ధంగా టీడీపీ మూకలు కుట్రపూరితంగా పోలీసులపై మూకుమ్మడి దాడికి తెగించడం గమనార్హం. శాంతియుతంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఒక్కసారిగా రెండు వేల మందికి పైగా ఉన్న టీడీపీ అల్లరి మూకలు దాడికి తెగబడ్డాయి. పోలీసుల నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకుండానే.. కవ్వింపు చర్యలు లేకుండానే.. టీడీపీ గూండాలు పోలీసులపై భారీ ఎత్తున రాళ్లదాడికి తెగబడి బీభత్సం సృష్టించారు. ఈ పచ్చ మూకల దాడిలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. కానిస్టేబుల్‌ రణధీర్‌ కంటి చూపు కోల్పోవడం బాధాకరం. 

రణధీర్‌కు అండగా ప్రభుత్వం
టీడీపీ గూండాల దాడిలో గాయపడిన కానిస్టేబుల్‌ రణధీర్‌కు ప్రభుత్వం పూర్తి అండగా నిలిచింది. ‘సాక్షి’ దినపత్రికలో మంగళవారం ‘ఈ దారుణానికి బాధ్యులెవరు?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందిస్తూ బాధిత కానిస్టేబుల్‌ రణధీర్‌కు ప్రభుత్వం రూ.10 లక్షల సాయం ప్రకటించింది. ఆయనకు మినిస్టీరియల్‌ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. రణధీర్‌కే కాదు యావత్‌ పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేసింది.

ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రులు బొత్స సత్య­నారాయణ, అమర్‌నాథ్, శాసనసభలో ప్రభుత్వ విప్‌ జి. శ్రీకాంత్‌రెడ్డి తదితరులు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ గూండాలు అంతగా బరితెగించి పోలీసులపై దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి చిత్తూరులో మంగళవారం పర్యటించారు. కానిస్టేబుల్‌ రణధీర్‌ను పరామర్శించారు. మెరుగైన వైద్యంతో పాటు అతని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

రణధీర్‌ కుటుంబానికి అండగా ఉంటాం
పుంగనూరు రాళ్ల దాడిలో గాయపడ్డ రణధీర్‌ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన చిత్తూరు పోలీసు అతిథి గృహంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ­స్వామి, కలెక్టర్‌ సగిలి షణ్మోహన్‌తో కలిసి మీడి­యాతో మాట్లాడారు. అల్లరి మూకల దాడిలో ఎస్టీఎఫ్‌ కానిస్టేబుల్‌ రణధీర్‌ ఒక కంటి చూపు పొగొట్టుకున్నారని, మరో కన్ను కూడా చూపును కోల్పోవచ్చని వైద్యులు చెప్పారన్నారు.

దాతల సాయంతో అతనికి మళ్లీ కంటి చూపు తెప్పించే ప్రయత్నం చేస్తామన్నారు.  రణధీర్‌కు కంటి చూపు పోవడంపై కొందరు విష ప్రచారం చేస్తుండటం తగదన్నారు. అల్లరి మూకలను కట్టడి చేయడంలో పోలీసులు చక్కగా విధులు నిర్వర్తించారని కొనియాడారు. పోలీసు శాఖ నిత్యం నిష్పక్షపాతంగా పనిచేస్తూ శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం పని చేస్తోందనే విషయాన్ని గుర్తించాలన్నారు.  

ప్రభుత్వ సాయం మరువలేను 
ఆ రోజు జరిగిన ఘటన ఇంకా నా మదిలో తిరుగుతూనే ఉంది. ఆస్పత్రిలో చేర్చిన మరుసటి రోజు డాక్టర్‌ వచ్చి ‘నల్లగుడ్డు, తెల్ల గుడ్డు చెదిరిపోయింది. నీకు ఒక కన్ను జీవితాంతం కనబడదు’ అని చెప్పగానే కాళ్ల కింద భూకంపం వచ్చినట్టు అయ్యింది. మా అమ్మా నాన్నకు ఏం చెప్పాలో తెలియలేదు. కట్టుకున్న భార్యకి చెప్పే ధైర్యం ఉన్నా.. ఆరో తరగతి, రెండో తరగతి చదువే నా పిల్లలకు ఏం చెప్పాలని తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నా.

కన్ను పోయిన నాకు పోలీసు ఉద్యోగం ఉంటాదో ఊడతాదో తెలియలేదు. ఆ సమయంలో చాలా భయమేసింది. నా బాధను ‘సాక్షి’ పత్రిక తప్ప మరే పేపర్‌ రాయలేదు. నేను పోలీసుని. రాజకీయ కార్యకర్తను కాదు. నాకు జరిగిన అన్యాయం ఎందుకు రాయలేదో కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు సీఎం జగన్‌ సార్‌ నా గురించి ఆరా తీసి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు ప్రకటించారు. నా కుటుంబాన్ని అన్ని విధా­లుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్లో ఆఫీసులో మినిస్టీరి­యల్‌ స్టాఫ్‌గా ఉద్యోగం ఇస్తామ­న్నారు. రాష్ట్ర మొత్తం నాకు అండగా నిలబడిందని సంతోషంగా ఉండాది. ఇది చాలు. – రణధీర్, కంటి చూపు కోల్పోయిన కానిస్టేబుల్‌

దాడులు చేయించింది బాబే 
పుంగనూరులో దాడులు చేయించింది టీడీపీ అధినేత చంద్రబాబే. బాబుకు కుట్ర రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య. పుంగనూరులో ఆయనలోని టెర్రరిజాన్ని చూపించాడు. రాష్ట్రంలో మరిన్ని అల్లర్లకు వ్యూహాలు రచిస్తున్నారు. పుంగనూరు దాడులపై చంద్రబాబుపై ఏ–1గా కేసు నమోదు చేయాలి.
– నారాయణస్వామి, ఉప ముఖ్యమంత్రి 

చంద్రబాబుపై రౌడీషీట్‌ తెరవాలి 
పుంగనూరులో హింసాత్మక ఘటనకు సూత్రధారి చంద్రబాబే. ఆయనపై రౌడీషీట్‌ తెరవాలి. పుంగనూరులో టీడీపీ వాళ్లు రెక్కీ నిర్వహించి, ఎవరెవరు ఏ విధంగా దాడులు జరపాలో స్కెచ్‌ వేసుకున్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగని దుర్మార్గమైన దాడి ఇది. ఈ దాడిలో పోలీసులను చంపాలనుకోవడం దుర్మార్గం. 40 మందికి పైగా పోలీసుల రక్తం కళ్ల చూశారు. సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నందున చంద్రబాబును ఉపేక్షించకూడదు.
– గుడివాడ అమర్‌నాథ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి 

టీడీపీ నేతలూ.. బాబును నమ్మొద్దు
పుంగనూరులో హింసకు ప్రధాన కార­కుడు ప్రతిపక్షనేత చంద్ర­బాబే. ఈ కేసులో ఆయన్ను ఏ–1గా చేర్చి రౌడీషీట్‌ తెరవాలి. ప్రాజెక్టుల యాత్ర పేరిట చంద్రబాబు.. టీడీపీ గూండాలు, రౌడీలతో ప్రజలపై దండయాత్ర చేస్తున్నారు. అల్లర్లు సృష్టిస్తే పోలీసులు కాల్పులు జరుపుతారని, ఆ కాల్పుల్లో టీడీపీ కార్యకర్తలు చనిపోతే రాజకీయంగా వాడుకోవాలన్నది చంద్ర­బాబు పన్నాగం. ఇలాంటి వ్యక్తి కోసం టీడీపీ కార్యకర్తలు బలికావద్దు. బాబును నమ్మకండి. కందుకూరులో ఇరుకు సందులో మీటింగ్‌ పెట్టి 8 మంది చనిపోవడానికి కారకుడైన బాబు గురించి ఎవరికి తెలియదు? – గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌

72 మందికి రిమాండ్‌
పరారీలో కీలక సూత్రధారి చల్లా బాబు
పుంగనూరు (చిత్తూరు జిల్లా): పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల దాడి ఘటనలో 72 మంది నిందితులను సోమవారం రాత్రి కడప సెంట్రల్‌ జైలుకు తరలిస్తూ అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సింధు ఉత్తర్వులు జారీ చేశారు. పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో టీడీపీ అల్లరి మూకలపై ఐదు కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్ధన్‌రెడ్డి పోలీసులకు చిక్కాడు. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని అతడు తెలిపినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

టీడీపీకి చెందిన చిత్తూరు, పల­మనేరు, పుంగనూరుకు చెందిన న్యాయవాదులు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు తెలిపిన సెక్షన్లు నిందితులకు వర్తించవని కోర్టులో వాదనలు వినిపించారు. ఏపీపీ రామకృష్ణ సాక్ష్యాధారాలను కోర్టుముందు ఉంచి, సుదీర్ఘంగా వివరించారు. దీంతో న్యాయమూర్తి ప్రాసిక్యూషన్‌ వాదనలతో ఏకీభవిస్తూ 72 మంది నిందితులను రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో వారిని సోమవారం అర్ధరాత్రి కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు.

కాగా, పుంగనూరులో పోలీసులపై టీడీపీ శ్రేణుల దాడికి నిరసనగా మంగళవారం విశాఖపట్నంలోని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజ­కవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర అదనపు కార్యదర్శి మొల్లి అప్పారావు, కార్పొరేటర్లు అక్కరమాని రోహిణి, కెల్లా సునీత, గేదెల లావణ్య, మువ్వ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

What’s your opinion

Advertisement