(ఫైల్) భర్త, పిల్లలతో మృతురాలు హేమలత (ఫైల్)
ముచ్చటైన కుటుంబం. ఏ కలతలూ లేవు. ఆర్థిక సమస్యలు అసలేలేవు. కుమారుల్లో ఒకరు జర్మనీలో ఉన్నత చదువులు. మరో కుమారుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం. ప్రొవిజన్స్ స్టోర్తో సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఒక్కసారి కుదుపు. దుకాణం నుంచి ఇంటికెళ్లొస్తానంటూ బయల్దేరిన మహిళ అనూహ్యంగా చావును ఆశ్రయించడం గంగనపల్లెను విషాదంలో ముంచెత్తింది.
చిత్తూరు కార్పొరేషన్: ఆదివారం నగరానికి చెందిన హేమలత (44) చిత్తూరు రైల్వేస్టేషన్ వద్ద రైలుకు ఎదురొడ్డి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆత్మహత్య వెనుక బలమైన కారణాలేవీ లేవని, మానసిక స్థితి సరిగా లేక, కుంగుబాటుకు గురై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తేలిందని రైల్వే జీఆర్పీ ఎస్సై నరసింహులు చెప్పారు. బంగారుపాళెంకు చెందిన హేమలతకు బావ వరుస అయిన చిత్తూరు గంగనపల్లెకు చెందిన చంద్రశేఖర్శెట్టితో 2001లో వివాహమైంది. మొదట్లో చంద్రశేఖర్ సోప్, నూనె డీలర్గా ఉంటూ చిల్లర దుకాణం నిర్వహించేవారు.
రెండూ చూసుకోవడం కష్టంగా మారడంతో గంగనపల్లెలో చిల్లర దుకాణం నిర్వహణకే పరిమితమయ్యారు. తొలి నుంచి హేమలత బాగానే ఉన్నప్పటికీ మూడేళ్ల క్రితం అత్త మరణం ఆమెను కుంగదీసింది. చిత్తూరు, వేలూరులోని ఆస్పత్రుల్లో ఆమెకు వైద్యం చేయించారు. తనకు నలతగా ఉందని, నిద్రపట్టడం లేదని, తినాలని లేదని, దడదడ ఉందని భర్త, పిల్లలతో తరచూ చెప్పేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. మరింత మెరుగైన చికిత్స కోసం తమిళనాడులోని వేరొక ఆస్పత్రికి తీసుకెళ్తానని భర్త చెప్పినా అవసరం లేదని, తాను బాగానే ఉన్నానని చెప్పేదని తెలిసింది. అంతేకాకుండా కొన్నిరోజులుగా ఆమె మందులు కూడా వేసుకోవడం మానేసినట్లు తెలియవచ్చింది.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం చిల్లర దుకాణాన్ని దంపతులు తెరిచారు. చంద్రశేఖర్రెడ్డి మార్కెట్కు వెళ్లి కూరగాయలు, సరుకులు తీసుకొని దుకాణానికి వచ్చారు. అప్పటికే చాలాసేపు ఆమె దుకాణంలో ఉండడంతో చంద్రశేఖర్రెడ్డి ఇద్దరికీ హోటల్ నుంచి టిఫిన్ తెచ్చాడు. దుకాణంలోనే తిన్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకొమ్మని భార్యకు చెప్పాడు. ఆమె రెస్ట్ తీసుకుని వస్తానంటూ బయల్దేరింది. అయితే ఇంటికి వెళ్లలేదు. తిన్నగా మూడు కిలోమీటర్ల దూరంలోని రైల్వేస్టేషన్కు కొత్తబస్టాండ్ సమీప మార్గంలో వచ్చి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది.
అప్పటికే భార్య కోసం గాలింపు..!
ఇంటికి వెళ్లిన చంద్రశేఖర్కు భార్య కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. ఆమె ఆచూకీ కోసం గాలించినా లభించలేదు. సాయంత్రం చిత్తూరు టౌటౌన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన “గుర్తు తెలియని మహిళ మృతి’ సమాచారాన్ని చూపారు. అంతేకాకుండా మృతురాలి కుడిచేతిపై మురళి అని పచ్చ»ొట్టు (మృతురాలి అన్న పేరు) ఉండటం కూడా చూశారు. ఆ మృతురాలు హేమలతే అని గ్రహించి భోరున విలపించారు. ఆ తర్వాత రైల్వే పోలీసులను సంప్రదించారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. గంగనపల్లె వాసులను ఈ ఉదంతం కలచివేసింది.


