breaking news
Chittoor Railway Station
-
ఏ కష్టం లేదు.. అయినా ఎందుకీ విషాద నిర్ణయం?
ముచ్చటైన కుటుంబం. ఏ కలతలూ లేవు. ఆర్థిక సమస్యలు అసలేలేవు. కుమారుల్లో ఒకరు జర్మనీలో ఉన్నత చదువులు. మరో కుమారుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం. ప్రొవిజన్స్ స్టోర్తో సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఒక్కసారి కుదుపు. దుకాణం నుంచి ఇంటికెళ్లొస్తానంటూ బయల్దేరిన మహిళ అనూహ్యంగా చావును ఆశ్రయించడం గంగనపల్లెను విషాదంలో ముంచెత్తింది. చిత్తూరు కార్పొరేషన్: ఆదివారం నగరానికి చెందిన హేమలత (44) చిత్తూరు రైల్వేస్టేషన్ వద్ద రైలుకు ఎదురొడ్డి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆత్మహత్య వెనుక బలమైన కారణాలేవీ లేవని, మానసిక స్థితి సరిగా లేక, కుంగుబాటుకు గురై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తేలిందని రైల్వే జీఆర్పీ ఎస్సై నరసింహులు చెప్పారు. బంగారుపాళెంకు చెందిన హేమలతకు బావ వరుస అయిన చిత్తూరు గంగనపల్లెకు చెందిన చంద్రశేఖర్శెట్టితో 2001లో వివాహమైంది. మొదట్లో చంద్రశేఖర్ సోప్, నూనె డీలర్గా ఉంటూ చిల్లర దుకాణం నిర్వహించేవారు. రెండూ చూసుకోవడం కష్టంగా మారడంతో గంగనపల్లెలో చిల్లర దుకాణం నిర్వహణకే పరిమితమయ్యారు. తొలి నుంచి హేమలత బాగానే ఉన్నప్పటికీ మూడేళ్ల క్రితం అత్త మరణం ఆమెను కుంగదీసింది. చిత్తూరు, వేలూరులోని ఆస్పత్రుల్లో ఆమెకు వైద్యం చేయించారు. తనకు నలతగా ఉందని, నిద్రపట్టడం లేదని, తినాలని లేదని, దడదడ ఉందని భర్త, పిల్లలతో తరచూ చెప్పేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. మరింత మెరుగైన చికిత్స కోసం తమిళనాడులోని వేరొక ఆస్పత్రికి తీసుకెళ్తానని భర్త చెప్పినా అవసరం లేదని, తాను బాగానే ఉన్నానని చెప్పేదని తెలిసింది. అంతేకాకుండా కొన్నిరోజులుగా ఆమె మందులు కూడా వేసుకోవడం మానేసినట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం చిల్లర దుకాణాన్ని దంపతులు తెరిచారు. చంద్రశేఖర్రెడ్డి మార్కెట్కు వెళ్లి కూరగాయలు, సరుకులు తీసుకొని దుకాణానికి వచ్చారు. అప్పటికే చాలాసేపు ఆమె దుకాణంలో ఉండడంతో చంద్రశేఖర్రెడ్డి ఇద్దరికీ హోటల్ నుంచి టిఫిన్ తెచ్చాడు. దుకాణంలోనే తిన్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకొమ్మని భార్యకు చెప్పాడు. ఆమె రెస్ట్ తీసుకుని వస్తానంటూ బయల్దేరింది. అయితే ఇంటికి వెళ్లలేదు. తిన్నగా మూడు కిలోమీటర్ల దూరంలోని రైల్వేస్టేషన్కు కొత్తబస్టాండ్ సమీప మార్గంలో వచ్చి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. అప్పటికే భార్య కోసం గాలింపు..! ఇంటికి వెళ్లిన చంద్రశేఖర్కు భార్య కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. ఆమె ఆచూకీ కోసం గాలించినా లభించలేదు. సాయంత్రం చిత్తూరు టౌటౌన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన “గుర్తు తెలియని మహిళ మృతి’ సమాచారాన్ని చూపారు. అంతేకాకుండా మృతురాలి కుడిచేతిపై మురళి అని పచ్చ»ొట్టు (మృతురాలి అన్న పేరు) ఉండటం కూడా చూశారు. ఆ మృతురాలు హేమలతే అని గ్రహించి భోరున విలపించారు. ఆ తర్వాత రైల్వే పోలీసులను సంప్రదించారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. గంగనపల్లె వాసులను ఈ ఉదంతం కలచివేసింది. -
అందరూ చూస్తుండగానే ఆత్మహత్య!
చిత్తూరు (అర్బన్) : చిత్తూరు రైల్వే స్టేషన్లో మంగళవారం ఉదయం ప్రయాణికులందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి రెప్పపాటు వ్యవధిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వివరాలు..ఉదయం 9.30 గంటల సమయంలో చిత్తూరు రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ఫాం నుంచి తిరుపతి వైపు నవయుగ ఎక్స్ప్రెస్ రైలు బయల్దేరింది. దేనికోసమో ఎదురుచూస్తున్నట్లు ప్లాట్ఫాం మధ్యలో బెంచీపై చాలాసేపటి నుంచి కూర్చున్న ఓ వ్యక్తి హఠాత్తుగా లేచాడు. అంతే! ఒక్క ఉదుటున లేచి రెండు బోగీల నడుమ ఉన్న గేప్లో రైలు పట్టాలపై తలపెట్టాడు. చక్రాలు మెడ మీదుగా వెళ్లడంతో తల, మొండెం వేరయ్యాయి. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ సంఘటనను చూసి ప్లాట్ఫాంలోని ఇతర ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుడు స్థానిక గిరింపేట బౌండువీధికి చెందిన ఎం.శరవణ (45) అని రైల్వే పోలీసులు గుర్తించారు. ఫొటో స్టూడియో నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఇతడు కుటుంబ, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు చంద్ర తెలిపారు. ఇదలా ఉంచితే, మృతుడి తల్లి గిరింపేట టీడీపీ కార్పొరేటర్గా పని చేస్తున్నారు. -
జోరుగా తమిళ బియ్యం దందా
తమిళ బియ్యూనికి పాలిష్ వేసి అమ్మకాలు రైళ్లలో దర్జాగా సాగుతున్న దిగుమతి కూలికి పనిచేస్తున్న పేదలు కోట్లకు పడగలెత్తుతున్న పెద్దలు చిత్తూరు (అర్బన్), న్యూస్లైన్: తమిళనాడు పేద ప్రజలకు అక్కడి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం చిత్తూరు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నారుు. ఈ బియ్యాన్ని చిత్తూరులోని కొందరు బడా వ్యాపారులు పాలిష్ చేసి మరీ బహిరంగ మార్కెట్లో కిలో రూ.45 వరకు విక్రయిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ వ్యవహారానికి చిత్తూరు రైల్వే స్టేషన్ కేంద్రంగా మారింది. ఈ వ్యాపారానికి కూలీనాలీ చేసి బతుకుతున్న పేదల్ని పావులుగా వాడుకుంటున్నారు. వేలూరు నుంచి దిగుమతి తమిళనాడులోని వేలూరు, చిత్తూరు మధ్య రోజూ పలు రైళ్లు నడుస్తున్నాయి. తమిళనాడులోని కొందరు దళారులు పేదల నుంచి ఉచిత బియ్యాన్ని కిలో ఒక్క రూపాయికి కొనుగోలు చేస్తున్నారు. దాన్ని చిత్తూరులోని వ్యాపారులకు కిలో రూ.5 లెక్కన విక్రయిస్తున్నారు. ఈ బియ్యాన్ని పాలిష్ చేసి ఎవరికీ అనుమానం రాకుండా చిత్తూరుతోపాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అది కూడా కిలో రూ.45 వరకు విక్రయిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో చిత్తూరు, తమిళనాడుకు చెందిన పలువురు పేద ప్రజల్ని బియ్యం వ్యాపారులు పావులుగా వాడుకుంటున్నారు. ఒక రోజుకు 15 కిలోల బియ్యాన్ని వేలూరు, కాట్పాడి ప్రాంతాల నుంచి భద్రంగా చిత్తూరు రైల్వే స్టేషన్కు తీసుకొచ్చి అందజేస్తే ఒక్కో మహిళకు కూలీ రూ.200 వరకు ఇస్తున్నారు. దీంతో ఎక్కువ మంది మహిళలు ఈ పనిపై ఆసక్తి చూపిస్తున్నారు. వెసులుబాటే అవకాశం రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఒకసారికి 20 కిలోల వరకు ధాన్యాన్ని తీసుకెళ్లే వెసులుబాటు ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న చిత్తూరు నగరానికి చెందిన కొందరు బియ్యం వ్యాపారులు రేషన్ బియ్యం రాకెట్ నడుపుతున్నారు. చౌకగా వచ్చే ప్రభుత్వ బియ్యానికి పాలిష్ వేసి మెరుగైన ధాన్యంగా ప్రజలకు విక్రయిస్తూ మోసం చేస్తున్నారు. దీనిని పట్టించుకుని అక్రమ రవాణాను ఆపాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రధానంగా కొందరు అధికారులు, సిబ్బందికి అక్రమ వ్యాపారం చేస్తున్న వారి నుంచి నెలసరి మామూళ్లు వెళుతున్నాయని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. రోగాల బారిన ప్రజలు పాలిష్ వేసిన తమిళనాడు బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. బియ్యం పాలిష్ చేయడం ద్వారా దానిపై ఉన్న తృణపొరలు తరిగిపోతాయని, వాటిని వండుకుని తినడం ద్వారా శరీరానికి పోషక పదార్థాలు అందకుండా వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


