కడుపునొప్పితో ఆస్పత్రిపాలు
ముగ్గురి పరిస్థితి విషమం
అల్లూరి జిల్లా జర్రెల ఆశ్రమ పాఠశాలలో ఘటన
సాక్షి, పాడేరు : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గూడెంకొత్తవీధి మండలం మారుమూల జర్రెల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో బుధవారం దుంపల కూర, పెరుగు తిన్న 29 మంది గిరిజన విద్యార్థులు కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరికి గురువారం ఉదయాన్నే నిద్రలేచిన కొద్దిసేపటి తరువాత ఒక్కసారిగా కడుపునొప్పి మొదలైంది. దీంతో.. పాఠశాలకు ఎదురుగా ఉన్న జర్రెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సకాలంలో వైద్యసేవలు అందించడంతో ప్రమాదం తప్పింది.
మధ్యాహ్ననికి 26 మంది కోలుకోవడంతో వారు పాఠశాలకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ, అరుణ్కుమార్ (10వ తరగతి), శామ్యూల్ (5వ తరగతి), కె. రవి (3వ తరగతి)కి బీపీ అధికంగా ఉండడంతో పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం నిమిత్తం ఈ ముగ్గుర్నీ చింతపల్లి కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ఈ పాఠశాలలో మొత్తం 240 మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు.
కలుషిత పెరుగే కారణమా!?..
ఈ ఆశ్రమ పాఠశాలకు పెరుగు సరఫరా లేకపోవడంతో నిర్వాహకులు పాలను తోడుపెడుతున్నారు. కానీ, పాలు తోడుకోలేదని బుధవారం మధ్యాహ్నం ఎండలో పెట్టడంతో పెరుగు కలుషితమై ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న చింతపల్లి సహాయ గిరిజన సంక్షేమాధికారి జయనాగలక్ష్మి ఉదయాన్నే జర్రెల ఆశ్రమ పాఠశాల, ఆస్పత్రిని సందర్శించి బాధిత విద్యార్థులను పరామర్శించి ఘటనపై విచారణ జరిపారు.
పెరుగు కలుషితంపై వివరాలు సేకరించారు. అలాగే, ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని సీఐటీయూ నేత చిలకల రవికుమార్, ఏబీవీపీ నేత తిరుపల్లి యోగిలు గురువారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడంవల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆరోపించారు.
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత
దళిత విద్యార్థి ఆత్మహత్యతో ఆందోళనకు దిగిన 3 వేల మంది విద్యార్థులు
తమ కుమారుణ్ని అన్యాయంగా చంపేశారంటూ తల్లిదండ్రుల ఆవేదన
8 మంది విద్యార్థులను సస్పెండ్ చేసిన డైరెక్టర్
శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురంలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో బుధవారం దళిత విద్యార్థి ప్రత్తిపాటి సృజన్ ఆత్మహత్య ఘటనతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గుంటూరుకు చెందిన సృజన్కు మద్దతుగా కళాశాలలోని 3 వేల మంది విద్యార్థులు గురువారం ఉదయం ధర్నాకు దిగారు. యాజమాన్యం తీరుపై నిరసన గళం వినిపించారు. సృజన్ ఆత్మహత్య చేసుకునేలా సీనియర్లు ప్రవర్తించారని, బుధవారం రాత్రి 11 గంటల నుంచి 3 గంటల వరకు చిత్రహింసలకు గురిచేశారని మండిపడ్డారు.
బ్యాక్లాగ్స్ ఉంచేశాడని, సరిగా చదవడని ఒత్తిడితోనే చనిపోయాడంటూ యాజమాన్యం చెప్పడం దుర్మార్గమన్నారు. తమ బిడ్డను అన్యాయంగా నాలుగు గంటలపాటు కొట్టి చంపేశారని, అనంతరం ఫ్యాన్కు వేలాడదీశారని, సమాచారం కూడా ఆలస్యంగా ఇచ్చారని సృజన్ తల్లిదండ్రులు వాపోయారు.
ఎస్ఎఫ్ఐ సభ్యులు సైతం కళాశాల డైరెక్టర్ కె.వి.జి.డి.బాలాజీ, రిజిస్ట్రార్ అమరేంద్రలతో వాగ్వాదానికి దిగారు. చివరికి శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది విద్యార్థుల్లో 8 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం క్యాంపస్ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు 8 మందిని సస్పెండ్ చేశారు.
భోజనం సరిగా పెట్టడం లేదు
వారానికి ఆరు సార్లకు బదులుగా రెండు సార్లే గుడ్లు ఇస్తున్నారు
ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యురాలికి విద్యార్థుల ఫిర్యాదు
మార్కాపురం టౌన్: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నాగులవరం రోడ్డులో ఉన్న ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు ఆహారాన్ని మెనూ ప్రకారం అందించడం లేదని ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమాల దేవి ఎదుట విద్యారి్థనులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆమె హాస్టల్ను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి హాస్టల్లో సౌకర్యాలు, మెనూ అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ వారానికి ఆరు సార్లు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా, రెండుసార్లు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు.
సాయంత్రం పండ్లు ఇవ్వడం లేదని, 301 మంది విద్యార్థినులు ఉండగా, రెండు లీటర్ల పాలు మాత్రమే ఇస్తున్నారని, తాగునీరు సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 మంది పిల్లలతో చపాతీలు తయారు చేయిస్తున్నారని, అన్నం కూడా సరిగ్గా పెట్టడం లేదని, మళ్లీ అన్నం కోసం వెళితే తిడుతున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ఫుడ్ కమిషన్ సభ్యురాలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్డెన్ను విధుల నుంచి తొలగించేలా ఉన్నతాధికారులకు నివేదిక పంపాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారిని ఆదేశించారు. అలాగే వంట సిబ్బందిని కూడా తొలగించాలన్నారు. విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించనని, కమిషన్ తరఫున కూడా సుమోటోగా తీసుకుంటామని తెలిపారు.


