సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉపాధ్యాయులను మచ్చిక చేసుకునేందుకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీచర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారనే విశ్వాసంతో వారిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు తాయిలాలను ఎరగా వేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ దంపతులకు పట్టు వస్త్రాలు అందజేసి, సన్మానం చేసేందుకు ఉపాధ్యాయ దినోత్సవాన్ని వేదికగా మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.
అనధికారిక సెలవు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. అనంతపురంలో కలెక్టర్ చేతుల మీదుగా డీఈఓ అధ్యక్షతన ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. అవార్డులు అందుకున్న టీచర్లకు డీఈఓ ఆన్డ్యూటీ పర్మిషన్ ఇచ్చారు. కానీ, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాటే వేద వాక్కుగా మారింది. ఎమ్మెల్యే ఆదేశాలతో శనివారం నియోజకవర్గ వ్యాప్తంగా పాఠశాలలకు అనధికారికంగా సెలవు ప్రకటించారు.
మధ్యాహ్నానికి అందరూ రావాలంటూ ఫోన్లు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం కళ్యాణదుర్గంలోని ఎమ్మెల్యే సొంత కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఉపాధ్యాయ దంపతులు మధ్యాహ్నానికల్లా హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది గురువారం నుంచే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీచర్లకు ఫోన్లు చేసి చెప్పారు. దీంతో టీచర్లు శనివారం ఉదయం 11 నుంచే పాఠశాలలకు అనధికారిక సెలవు ప్రకటించారు. విద్యార్థులను ఇంటికి పంపించేసి..వారు మాత్రం కళ్యాణదుర్గం బాటపట్టారు. నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం, కంబదూరు, శెట్టూరు, కుందుర్పి, బ్రహ్మసముద్రం మండలాలలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 290 వరకు ఉన్నాయి. వీటిలో 38 వేల మంది దాకా విద్యార్థులు ఉన్నారు.
కలెక్టర్ ఏం చేస్తున్నారు?
సాధారణంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు విద్యార్థులు తమ గురువులను సత్కరించడం, పూజించడం చేస్తుంటారు. కానీ, ఎమ్మెల్యే నిర్వాకంతో విద్యార్థులు తమ టీచర్లను సత్కరించకుండానే పాఠశాలలను విడిచి వెళ్లాల్సి వచ్చింది. అనధికారిక సెలవుపై కలెక్టర్ ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
పాఠశాలకు అనధికారిక సెలవు ప్రకటించడంతో ఇంటికి వెళ్తున్న విద్యార్థులు ఎమ్మెల్యే అమిలినేని కార్యాలయం వద్దకు చేరుకున్న ఉపాధ్యాయ దంపతులు
05ఏటీపీ02
మూతపడిన ప్రభుత్వ పాఠశాలలు
ఉపాధ్యాయులంతా ఎమ్మెల్యే కార్యాలయానికి రావాలంటూఫోన్లలో హుకుం
అమిలినేని ఆదేశాలతో పాఠశాలలను, విద్యార్థులను వదిలేసి వెళ్లిన టీచర్లు


