● విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం
● 67 మంది టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం
అనంతపురం ఎడ్యుకేషన్: తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువు జీవితానికి అర్థం నేర్పుతారు. పుస్తకంలోని పాఠాలతో పాటు క్రమశిక్షణ, విలువలు, బాధ్యత, మానవత్వాన్ని బోధించే గురువును మించిన దేవుడు లేరని వక్తలు కొనియాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అధ్యక్షత వహించారు. కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్సీ రామగోపాల్రెడ్డి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప, లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్, ఆర్జేడీ శామ్యూల్, డీఈఓ అయ్యూబ్ హుస్సేన్, సమగ్రశిక్ష ఏపీసీ శైలజ, డిప్యూటీ డీఈఓలు శ్రీనివాసరావు, కృష్ణయ్య, డీసీఈబీ కార్యదర్శి గంధం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానవక్తలు మాట్లాడుతూ ‘విద్యార్థి భవిష్యత్తుకు గురువే దిక్సూచి. అక్షర జ్ఞానం నుంచి ఆత్మవిశ్వాసం వరకు గురువే మార్గదర్శి. సమాజ నిర్మాణానికి గురువులే మూలస్తంభాలు. తరాలను తీర్చిదిద్దే శిల్పులు.. ఉపాధ్యాయులు’ అని కొనియాడారు. విద్యార్థి విజయమే గురువుకు అసలైన అవార్డు అన్నారు. నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలు.. వారిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అన్నారు. అలాంటి గురువుల సేవలను స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చదువు చెప్పిన కళాశాలలో గురుపూజోత్సవం జరుపుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. సమాజానికి మంచి పౌరులను అందిస్తున్న గురువులను గౌరవించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం జిల్లాస్థాయి ఉత్తమ టీచర్ అవార్డులకు ఎంపికై న 67 మంది టీచర్లను అతిథుల చేతుల మీదుగా సత్కరించారు. ఈ సందర్భంగా ‘విలువల విద్య’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.


