అనంతపురం: ‘తాడిపత్రిలో ఇటీవల పట్టుబడిన గోవా లిక్కర్ అక్రమ సరఫరా కేసులో నిజాలు నిగ్గుతేల్చేందుకు వైఎస్సార్సీపీ నేతలతో కమిటీ వేయాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి అంటున్నారు. వైఎస్సార్సీపీ నేతలతో ఎందుకు.. మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్తోనే కమిటీ వేయాలి’ అని వైఎస్సార్సీపీకి చెందిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సూచించారు. అనంతపురంలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గోవా లిక్కర్ అక్రమ సరఫరాతో పాటు తాడిపత్రి లో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ మద్యం, గంజాయి, పేకాటపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ల వద్దే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. అయినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తాడి పత్రి పోలీసు స్టేషన్లకు జేసీ స్టేషన్లు అని పేరు పెట్టాలని ఎద్దేవా చేశారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డిని గ్యాంగ్స్టర్లా తయారు చేశారని విమర్శించారు. అసెంబ్లీ రౌడీ సినిమా తరహాలో తాడిపత్రిలో జేసీ టీస్టాల్, జేసీ షాపులు, చివరకు జేసీ పోలీస్ స్టేషన్, జేసీ మున్సిపల్ ఆఫీస్ పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 24 మంది వైఎస్సార్సీపీ నేతలను అంతం చేస్తామని ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిస్తున్నా.. పోలీసులు కనీసం చర్యలు తీసుకోలేదన్నారు. సాక్షాత్తూ ఎస్పీ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అధికార పార్టీ అండదండలు లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్క నిమిషం కూడా రాజకీయాలు చేయలేరన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే.. జేసికి దమ్ము ఉందా, కేతిరెడ్డికి దమ్ము ఉందా అనేది తేలుతుందని సవాల్ విసిరారు. జేసీ చేస్తున్న అరాచకాలు, అక్రమ మద్యం, బెల్టు షాపులు, గంజాయి, అక్రమ వసూళ్లపై విచారించాలన్నారు. మాట్లాడితే తాను వాళ్ల ఇంటికి వెళ్లానని అంటున్నారని, అసలు తాను ఎందుకు వెళ్లానో ఎవరూ అడగకపోవడం శోచనీయమని అన్నారు. గంజాయి బ్యాచ్ పోలీసులపై కూడా దాడులు చేస్తున్నారన్నారు. అసలు తాడిపత్రి మున్సిపాలిటీతో జేసీకి ఏంటి సంబంధమని నిలదీశారు. జేసీ కొడుక్కి రోడ్డు క్లియర్ చేసి వెళ్లలేదని, సమస్యలను సృష్టించి ఇచ్చే సంస్కృతిని తెచ్చారని విమర్శించారు. చివరకు పెళ్లిళ్లకు పోయినా గొడవలకు దిగుతున్నాడని, ఆయన్ను శుభకార్యాలకు పిలవాలన్నా ప్రజలు వెనకాడుతున్నారని అన్నారు. ఎవరు తాడిపత్రికి వచ్చినా తనపై 95 కేసులు పెట్టారని ఏడుస్తాడని, అసలు ఆయన పార్టీ కోసం కష్టపడితే కేసులు పెట్టలేదని, దొంగ బస్సులు నడిపి.. దొంగగా మారడంతో పెట్టారని గుర్తు చేశారు.
వైఎస్సార్సీపీ నేతలతో కమిటీ వేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు
వైఎస్సార్ సీపీ నేతలు ఎందుకు.. మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్లతో కమిటీ వేయండి
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి


