బొమ్మనహాళ్: ఎల్–నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో రాలేదు. హెచ్చెల్సీ ద్వారా వచ్చే నీటితోనైనా పంటలు పండించుకుందామని ఆశించిన రైతులకు భంగపాటు తప్పలేదు. మండలంలో హెచ్చెల్సీ ద్వారా పారేనీటిని రైతులు మోటర్ల ద్వారా వాడుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ అధికారులు శనివారం చాటింపు వేయించారు. ఈ ఏడాది తాగునీటికి మాత్రమే కేటాయించారంటూ ప్రకటించడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి.
తాగునీటికే తొలి ప్రాధాన్యత
అనంతపురం అర్బన్: ‘జిల్లాపై ఎల్–నినో ప్రభావం తీవ్రంగా ఉన్నందున.. మనకు కేటాయించిన నీటిలో తొలి ప్రాధాన్యత తాగునీటికేనని కలెక్టర్ ఆనంద్ మరోమారు స్పష్టం చేశారు. సాగుకు ఇవ్వడానికి వీలుపడదని, ఈ విషయంలో రైతులు సహకరించి వరి కాకుండా ఆరుతడి, పీఎండీఎస్ పంటలే సాగు చేయాలని సూచించారు. నీటి వినియోగంపై కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హెచ్చెల్సీ ఎస్ఈ సుధాకర్రావు, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ రాజగోపాల్, డీఆర్ఓ మలోలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు హెచ్చెల్సీ నుంచి 16 టీఎంసీల కేటాయింపు ఉందన్నారు. అయితే నీటి ఆవిరి, భూమిలో ఇంకడం ద్వారా వచ్చే నష్టాలు 40 నుంచి 45 శాతం ఉంటాయన్నారు. ఈ క్రమంలో 9 టీఎంసీల నుంచి 10 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. ఈ నీటిని రాబోయే జూలై వరకు తాగునీటికి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సి ఉంటుందన్నారు.
పరిశీలనకు రాకపోతే ఓటు ఉండదు
‘సర్’ ప్రక్రియలో భాగంగా నాన్ మ్యాపింగ్, మ్యాపింగ్లో తప్పులు ఉండి నోటీసులు అందుకున్న నిర్దేశించిన తేదీలో తప్పనిసరిగా పరిశీలనకు హాజరైన ధ్రువపత్రాలను సమర్పించాలన్నారు. హాజరవ్వని వారి ఓటు జాబితా నుంచి తొలగిపోతుందన్నారు. జిల్లాలోని 576 పంచాయతీలకు సంబంధించి ఓటర్ల జాబితా సిద్ధంగా ఉందని చెప్పారు. అదే విధంగా మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి ఆరు ముసిపిపాలిటీల్లో మూడు చోట్ల కోర్టు కేసు ఉందన్నారు.


