అనంతపురం: విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ‘నిర్మాణ’ సంస్థతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహకారంతో హబ్ అండ్ స్పోక్ విధానంలో విద్యార్థులకు ఉచితంగా ఎంప్లాయిబులిటీ, టెక్నికల్ స్కిల్స్లో శిక్షణ అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన శిక్షణ, ధ్రువపత్రాలు, పరిశ్రమలతో పరస్పర సంబంధాలు, ప్లేస్మెంట్, జాబ్ డ్రైవ్లు, ఇంటర్న్షిప్లు తదితర అవకాశాలు కల్పించనున్నారు. పరిసర ప్రాంతంలోని ఇతర కళాశాలలకు కూడా ఈ శిక్షణ ప్రయోజనాలను విస్తరించనున్నారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితమని, విద్యార్థులు లేదా కళాశాల యాజమాన్యం నుంచి ఎలాంటి రుసుమూ వసూలు చేయబోమని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ ఎన్వీఆర్ జ్యోతికుమార్ మాట్లాడుతూ నిర్మాణ – ఇన్ఫోసిస్ ఫౌండేషన్ల సహకారంతో చేపడుతున్న ఈ కార్యక్రమం విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఒక మంచి ముందడుగు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ బాబు, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర, ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ అనిత, పీఆర్వో డాక్టర్ బి.సత్యనారాయణ పాల్గొన్నారు.
మంచి అలవాట్లు అలవర్చుకోండి
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం మంచి అలవాట్లను అలవర్చుకోవాలని డీఈఓ అయూబ్ హుస్సేన్ సూచించారు. అనంతపురం రూరల్ రుద్రంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఈఓ ఉదయం ప్రార్థనా సమయంలో పాఠశాలకు హాజరై విద్యార్థులతో మాట్లాడారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఆవశ్యకతను వివరించి, పాఠశాలలోనే కాకుండా నిత్య జీవితంలోనూ పరిశుభ్రత, క్రమశిక్షణ వంటి మంచి అలవాట్లను పాటించాలని సూచించారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులతో డీఈఓ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి మూడో శనివారం ‘నో బ్యాగ్ డే’ నిర్వహించి విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచే నూతన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. అనంతరం హెచ్ఎం సుమంగళితో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం ఆ మొక్కను ఓ విద్యార్థినికి దత్తత ఇచ్చి, దానిని సంరక్షిస్తూ పెద్దదిగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓలు వెంకటస్వామి, సరితారాణి, ఏపీఓ మంజునాథ్, ఉపాధ్యాయులు రమణారెడ్డి, వేణు, ఓబులపతి, గురువిరెడ్డి, తిప్పయ్య, విద్యావతీదేవి, హైమావతి, రవీంద్రారెడ్డి, లావణ్య పాల్గొన్నారు.


