అనంతపురం అర్బన్: ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) భాగంగా చేపట్టిన ఓటర్ల ఎన్యుమరేషన్ ద్వారా 3.83 లక్షల ఓట్లు నిబంధనలకు విరుద్ధంగా (ఎనిమిలస్) ఉన్నట్లు గుర్తించారు. వీటికి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 2.64 లక్షలు నోటీసులు సిద్ధం చేశారు. మిగిలిన 1.16 ఓట్లకు నోటీసులు సిద్ధం చేయండి’’ అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ అన్నారు. ‘ఎస్ఐఆర్’పై కలెక్టర్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత ఈఆర్ఓలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచురించిన ఓటర్ల ముసాయిదా జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాలు ఉంటే ఈనెల 30లోగా ఏఈఆర్ఓలు, ఈఆర్ఓల వద్ద నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అందిన వాటికి మూడు రోజుల్లోగా ఈఆర్ఓ నోటీసు జారీ చేసి హియరింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారానికి ఈఆర్ఓలు అత్యంత ప్రాధానత ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి రోజూ కనీసం లక్ష నోటీసులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫోన్ నంబరు, వివరాల ఆధారంగా బీఎల్ఓల సహకారంతో నోటీసులు పంపిణీ చేయాలన్నారు. ప్రతి ఈఆర్ఓకు ఐదారుగురు ఏఈఆర్ఓలను అదనంగా ఎన్నికల కమిషన్ కేటాయించింద న్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా 3,83,391 ఓట్లు ఉండగా ఇప్పటి వరకు 2,64,640 ఓట్లకు నోటీసులు సిద్ధం చేశారని, మిగిలిన 1,16,381 ఓట్లకు సంబంధించి నోటీసులు సిద్ధం చేయాలని ఆదేశించారు. రోజుకు కనీసం లక్ష నోటీసులు పంపిణీ చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని చెప్పారు. నోటీసు జారీ చేసిన ఏడు రోజుల వ్యవధి ఉండేలా హియరింగ్ తేదీ ఇవాల్సి ఉంటుందన్నారు. త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసి క్లెయిమ్లు, అభ్యంతరాలు పరిష్కరించాలని ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్లో డీఆర్ఓ ఎ.మలోల, ఈఆర్ఓలు పాల్గొన్నారు.


