రాయదుర్గం టౌన్: దాదాపు 75 వేలకు పైగా జనాభా ఉన్న రాయదుర్గంలో ఐదు రోజులుగా దాహం కేకలు మిన్నంటుతున్నాయి. మొత్తం 32 వార్డుల్లో బోర్లు పనిచేయడం లేదు. కేవలం రెండు ట్యాంకర్ల ద్వారా మాత్రమే మున్సిపాలిటీ అధికారులు అందజేస్తున్న నీరు ప్రజల అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. ట్యాంకర్ల సంఖ్య పెంచి నీటిని సరఫరా చేయడం లాంటి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నా అధికారులు స్పందించడం లేదు. అరకొర నీటితోనే ఉగాది పండుగను జరుపుకున్న ప్రజలు... రానున్న రంజాన్, శ్రీరామనవమి పండుగలు ఎలా చేయాలో అర్థం కాక తలలు బాదుకుంటున్నారు. ప్రజల తాగునీటి కష్టాలు స్థానిక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పట్టించుకోక పోవడంతో సమస్య మరింత జఠిలంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


