అనంతపురం అర్బన్: ‘ఓటరు జాబితాకు సంబంధించి త్వరలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి’ అని డీఆర్ఓ ఎ.మలోల అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులో డీఆర్ఓ గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నుంచి షెడ్యూల్ వెలువడిన వెంటనే జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రారంభమవుతుందన్నారు. ఓటర్ల నమోదు, తొలగింపు, వివరాల మార్పు ప్రక్రియను బీఎల్ఓలు చేపడతారన్నారు. ఇప్పటి వరకు ఓటరు నమోదు (ఫారం6), ఓటు తొలగింపు (ఫారం7), వివరాల మార్పు (ఫారం8)కు సంబంధించి అందిన క్లెయిమ్లు, పరిష్కారం, ఓటరు మ్యాపింగ్ తదితర వివరాలను తెలియజేశారు. సమావేశంలో పార్టీల ప్రతినిధులు సోమశేఖర్రెడ్డి, ఈశ్వరప్రసాద్, నారాయణస్వామి,బాలరంగయ్య, అంజయ్య, ఇమామ్ వలి, ఎన్నికల డీటీ కనకరాజు, ఎస్ఏ శామ్యూల్ బెంజిమెన్, ఐటీ వింగ్ శివ, తదితరులు పాల్గొన్నారు.


