● సామాజిక తనిఖీలో బహిర్గతమైన అవినీతి
ఉరవకొండ: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉరవకొండ మండలంలో చేపట్టిన పనుల్లో రూ.1.50 కోట్ల మేర అవినీతి, అక్రమాలు జరిగాయని అధికారులు స్పష్టం చేశారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏపీడీ సుధాకర్రెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారి శ్రీనివాసులు, ఎంపీడీఓ రవిప్రసాద్ సమక్షంలో నిర్వహించిన ఓపెన్ ఫోరంలో అక్రమాలను సామాజిక తనిఖీ బృందం నివేదించింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉరవకొండ మండలంలోని 17 పంచాయతీల పరిధిలో చేసిన 1,394 పనులకు గాను రూ.8.17 కోట్లు వెచ్చించారు. కొందరు ఉపాధి హామీ సిబ్బంది అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తూ నామమాత్రపు పనులతో రూ.లక్షలు స్వాహా చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో బోగస్ కూలీలను సృష్టించి వారి పేర్లతో సొమ్ము చేసుకున్నారు. ఈ క్రమంలో రూ.1.50 కోట్ల మేర అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా నిర్ధారణ కావడంతో రూ.1.48 లక్షల రికవరీకి అధికారులు ఆదేశించారు. ఈ అక్రమాలపై మరింత లోతుగా విచారణ కొనసాగించి పూర్తి స్థాయి సొమ్మును రికవరీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు


