● శాసన మండలిలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి
ఉరవకొండ: పోలీసు సిబ్బందిని నిబంధనల మేరకు సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి శాసన మండలిలో ప్రత్యేక నివేదన కింద ప్రస్తావించారు. జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు పోలీసు శాఖలో ఏఆర్ సిబ్బందిని తాత్కాలికంగా ‘ఆర్డర్ టూ సర్వ్ డ్యూటీ’ అంటూ లోకల్ స్టేటస్ నిబంధన పాటించకుండా విభజించారన్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో ఒక్క పోలీసు శాఖలోనే నిబంధనలను పక్కనపెట్టి ఇష్టానుసారంగా సిబ్బందిని కొత్త జిల్లాలకు కేటాయించారన్నారు. ముఖ్యంగా ఏఆర్ సిబ్బంది సొంత జిల్లాలు వదిలి వేరే జిల్లాల్లో పనిచేస్తూ తల్లిదండ్రులు, పిల్లల చదువులు చూసుకోలేక అవస్థలు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు విన్నవిస్తే గెజిట్ తర్వాత సొంత జిల్లాలకు పంపుతామని తెలిపారన్నారు. నాలుగేళ్లుగా ‘ఆర్డర్ టూ సర్వ్’ నిబంధన మీద పనిచేస్తున్న ఏఆర్ సిబ్బందిని సొంత జిల్లాలకు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై హోం మంత్రి అనిత సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.


