శోకసంద్రంలో నేమకల్లు
● కన్నీళ్లతో సింధు అంత్యక్రియలు
● అనూష కోసం ముమ్మర గాలింపు
బొమ్మనహాళ్: మండలంలోని నేమకల్లు గ్రామం శోకసంద్రమైంది. కాలువలో కలిసి పోయిన చిన్నారుల బతుకులు గ్రామాన్ని కలిచివేశాయి. తండ్రి చేతిలోనే ప్రాణాలు కోల్పోయిన చిన్నారి సింధు (11) అంత్యక్రియలు బుధవారం గ్రామస్తుల కన్నీళ్ల మధ్య సాగింది. మరో బాలిక అనూష కోసం తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)లో గాలింపు కొనసాగుతోంది. గ్రామానికి చెందిన కల్లప్ప తన ఇద్దరు కుమారైలు సింధు (11), అనూష (9)ను ఎల్లెల్సీలో తోసేసిన ఘటనలో సింధు మంగళవారం మధ్యాహ్నం మృతదేహం లభ్యం కావడంతో యావత్ గ్రామం దిగ్భ్రాంతికి లోనైంది. అయితే రెండో అమ్మాయి అనూష ఆచూకీ లభ్యం కాకపోవడం కలవర పెడుతోంది. దిగువ కాలువ వెంబడి కర్ణాటక పరిధిలోని నాగేనహాళ్లి, మోకా, దమ్మురు, తిరిగేరి ప్రాంతాల్లో పోలీసులు, బంధువులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన వెనుక అసలు కారణాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి. కుటుంబ కలహాలా? మానసిక సమస్యనా? లేక మరేదైనా ఉందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కల్లప్ప ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను పూర్తిగా కోలుకొని విచారణకు సహకరిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని బొమ్మనహాళ్ ఎస్ఐ నబీరసూల్ తెలిపారు.


