తల్లిదండ్రుల కమిటీ సమావేశాల్లో సమస్యలపై చర్చలు జరిపితే ఒట్టు
సభ్యులకు ఎలాంటి సమాచారమూ తెలియని పరిస్థితి
పట్టనట్లు వ్యవహరిస్తున్న ఎంఈఓలు
అనంతపురం సిటీ: పాఠశాలల్లోని సమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించడం.. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి విద్యాబోధన సాఫీగా సాగేలా చూడాల్సిన తల్లిదండ్రుల సమావేశాలు మొక్కుబడి తంతుగా మారాయి. ప్రతి నెలా నిర్వహించాల్సిన సమావేశాలను ప్రధానోపాధ్యాయులు పుస్తకాల్లో తమకు తోచింది రాసేయడం, పాఠశాల కమిటీ చైర్మన్, సభ్యులను విడివిడిగా పిలిపించుకొని మినిట్స్ పుస్తకాల్లో సంతకాలు పెట్టించుకోవడం పరిపాటిగా మారింది. పాఠశాలల్లో ఏం జరుగుతోందో పిల్లల తల్లిదండ్రులకు తెలియకుండాపోతోంది. పర్యవేక్షించాల్సిన ఎంఈఓలు పత్తా లేకుండాపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది.
జరక్కపోయినా.. జరిగినట్లు
జిల్లా వ్యాప్తంగా సుమారు 90 శాతం పాఠశాలల్లో ప్రతి నెలా తల్లిదండ్రుల కమిటీ సమావేశాలు నిర్వహించడం లేదని ఉపాధ్యాయ వర్గాలే చెబుతున్నాయి. ప్రతి నెలా సమావేశాలకు పిలిస్తే తల్లిదండ్రులు రావడం లేదనే కారణం చెబుతు న్నారు. వాస్తవంగా ప్రతి నెలా సమావేశం నిర్వహించి పిల్లల ప్రవర్తన, చదువు, తోటి విద్యార్థులతో వారు ఎలా మసలుకుంటున్నారనే అంశాలను తల్లిదండ్రుల దృష్టికి ఉపాధ్యాయులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే అటువంటి ప్రయత్నాలేవీ జరిగిన దాఖలాల్లేవు. ప్రభుత్వం నిబంధన పెట్టింది కాబట్టి తమకు తప్పదన్నట్లు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు కలసి సమావేశాలు నిర్వహించినట్లు రికార్డులు రాసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాళ్లే కొన్ని సమస్యలు అడిగినట్లు నమోదు చేసుకోవడం చివరగా సంతకాలు పెట్టి, చైర్మన్, సభ్యులను విడివిడిగా పిలిపించుకొని సంతకాలు పెట్టించుకోవడం పరిపాటిగా మారిందంటున్నారు.
మెగా పీటీఎం సమావేశాలకే ప్రాధాన్యం
మెగా పీటీఎం సమావేశాలకు ఇచ్చే ప్రాధాన్యం నెలవారీ సమావేశాలకు ఇవ్వడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు సర్కారు వచ్చాక 2024 డిసెంబర్ 24న తొలి సమావేశం నిర్వహించగా, ఈ ఏడాది జూలై 25న మెగా పీటీఎం–2.0 సమావేశం నిర్వహించారు. ఇక అప్పటి నుంచి మళ్లీ నిర్వహించలేదు. అయితే, ఆయా సమావేశాల్లో గుర్తించిన సమస్యలు, చర్చించిన అంశాలేవీ ఇంత వరకు అమలైన దాఖలాల్లేవని ఉపాధ్యాయ వర్గాల ద్వారా తెలిసింది.
ఎంఈఓలు ఏం చేస్తున్నట్లు..?
ప్రతి నెలా తల్లిదండ్రుల కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారా.. లేదా అని పర్యవేక్షించాల్సిన ఎంఈఓలు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు: 1,236
ప్రాథమికోన్నత పాఠశాలలు: 59
ఉన్నత పాఠశాలలు: 435
మొత్తం విద్యార్థుల సంఖ్య: 2,06,654


