
జాతీయ సాహస శిబిరానికి ఎంపిక
రాయదుర్గం టౌన్: స్థానిక కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ద్వితీయ సంవత్సరం (బీఎస్సీ) విద్యార్థి జె.గౌతమ్ జాతీయ సాహస శిబిరానికి ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ కె.లక్ష్మీనారాయణ శుక్రవారం వెల్లడించారు. జాతీయ పర్వతారోహణ సంస్థ ఆధ్వర్యంలో అరుణాచల్ప్రదేశ్లో దిరాంగ్ గ్రామంలో అడ్వెంచర్ స్పోర్ట్స్ పై ఎన్సీసీ క్యాడెట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిబిరానికి తమ కళాశాలలోని ఎన్సీసీ యూనిట్కు చెందిన గౌతమ్ ఎంపిక కావడంతో ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించి, వీడ్కోలు పలికారు.
నేడు మట్టి వినాయక విగ్రహాల తయారీ పోటీలు
అనంతపురం ఎడ్యుకేషన్/టౌన్: వినాయక చవితిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు శనివారం ‘మట్టి వినాయక విగ్రహాల తయారీ’ పొటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ప్రసాద్బాబు, కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్ పీవీ కిషోర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు అనంతపురంలోని శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల నుంచి 6–10వ తరగతి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు. విగ్రహాల తయారీకి అవసరమైన బంకమట్టి, నీటిని సమకూర్చుతామన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన విగ్రహాల వల్ల, వాటి అలంకరణకు వాడుతున్న కృత్రిమ రంగుల వల్ల నీటి, నేల కాలుష్యం జరిగి పర్యావరణ విధ్వంసానికి దారితీస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చిన్నారులలో పర్యావరణ స్పృహ పెంచాలనే ఉద్దేశంతో ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.