
ఇంకెంత కాలం పస్తులుంచుతారు?
అనంతపురం అర్బన్: వేతనాలివ్వకుండా ఇంకెన్నాళ్లు శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా పథకం కార్మికులను పస్తులుంచుతారంటూ కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. తక్షణమే ప్రత్యేక నిధులు విడుదల చేసి కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించాలంటూ శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షుడు జి.ఓబుళు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రాజారెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో 600 మంది కార్మికులు వివిధ కాంట్రాక్ట్ ఏజెన్సీల కింద 16 ఏళ్లుగా పనిచేస్తున్నారన్నారు. వీరికి సంబంధించి నెలల తరబడి పీఎఫ్ బకాయిలు, వేతనాలు చెల్లించకుండా ఏజెన్సీల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పీఎఫ్, వేతనాలు చెల్లించని కాంట్రాక్టు ఏజెన్సీలపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వం స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించడం ద్వారా కార్మికులకు వేతన, పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ వినోద్కుమార్ను కలిసి నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు నాగమణి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, నీటి సరఫరా పథకం కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాము, ఇతర నాయకులు పాల్గొన్నారు.
తాగునీటి పథకం కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలి
ధర్నాలో కార్మిక సంఘాల నేతల డిమాండ్